వైఎస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభం-ప్రతీ అడుగులో రైతుకు అండగా ఉన్నామన్న జగన్..
ఏపీ ప్రభుత్వం తరఫున రైతులకు యంత్ర పరికరాలు అందజేసే వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరులో ప్రారంభించారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. గుంటూరులోని చుట్టుగుంటలో రోడ్లపై ట్రాక్టర్లను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అందిస్తున్న సేవలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో సీఎం జగన్ పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమచేశారు.

వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోందని, ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నామని జగన్ తెలిపారు. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నామని జగన్ తెలిపారు. 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications