వరద సాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండి - రూ 6,054 కోట్ల నష్టం జరిగింది : ప్రధాని-షా లకు సీఎం జగన్ లేఖలు..!!
ఏపీలో కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం గురించి విరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వేర్వేరుగా లేఖలు రాసారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరిన సీఎం..నాలుగు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. చాలాచోట్ల 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని చెప్పుకొచ్చారు.

నాలుగు జిల్లాల్లో భారీ నష్టం జరిగింది
తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాల్లో భారీవర్షాలకు నీటమునిగాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు. ప్రాధమిక అంచనాల మేరకు ఈ వదరల కారణంగా రూ 6,054 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు.196 మండలాలు నీటమునిగాయని..324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలో 18, 19 తేదీల్లో కురిసిన భారీ వర్షాలు..తదనంతర పరిస్థితులను సీఎం జగన్ లేఖల్లో వివరించారు.

అండగా నిలుస్తామని ప్రధాని హామీ
వరదల సమయంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసారు. రాష్ట్రంలో పరిస్థితి పైన సీఎం వివరించారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించగా... కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని ఆ సందర్భంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ రోజు వదరల పరిస్థితి పైన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి..శాఖల వారీగా నష్టాల అంచనాలను ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచారు. వర్షాలు..వరదల కారణంగా 1.43 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని..పంటల వారీగా వివరించారు.

ఏ రంగంలో ఎంత మేర నష్టం జరిగిందో వివరిస్తూ
42299 హెక్టార్లలో ఉద్యాన పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1887 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నట్లు చెప్పుకొచ్చారు. 196 మండలాల్లో 1402 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయని వివరించారు. వరదల కారణంగా.. 69,616 మందిని పునారావస శిబిరాలకు తరలించామని చెప్పుకొచ్చారు. ఇక, వ్యవసాయం రూ 1353 కోట్లు మేర నష్టపోగా..హార్టికల్చర్ రూ 48 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో రూ 1756 కోట్ల మేర నష్టం జరిగిందని పూర్తి వివరాలు పొందు పరిచారు. సాగునీటి పారుదల రంగం లో రూ 556 కోట్ల మేర నష్టం జరిగిందని.. విద్యుత్ శాఖకు రూ 252 నష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు.

ప్రధాని స్పందన కోసం నిరీక్షణ
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు రూ 453 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా సీఎం జగన్ తన లేఖలో వివరించారు. మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో రూ 12 కోట్లు నష్టం పోయామని..పంచాయితీ రాజ్ శాఖ కింద నిర్వహించే పనుల్లో రూ 381 కోట్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి లేఖలో వివరంగా పొందుపరిచారు. మొత్తంగా.. రూ 6,054 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేసారు. దీంతో..కేంద్రం ఉదారంగా ఏపీకి సాయం అందించాలని...భారీగా నష్టం వాటిల్లటం తో అండగా నిలవాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. ఇక, ఈ లేఖల పైన ప్రధాని మోదీ ఏ రకంగా స్పందిస్తారు.. ఏ మేర సాయం అందిస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications