నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఖరారు - అనిల్ పై ఫిర్యాదు, వాట్ నెక్స్ట్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇప్పటి వరకు వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు జిల్లాలో మారుతున్న లెక్కలతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ముందుగానే జిల్లాలో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారదు. అందులో భాగంగా నెల్లూరు ఎంపీ అభ్యర్ధిని దాదాపు ఖరారు చేసారు. అయితే, మాజీ మంత్రి అనిల్ పైన ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సీఎం జగన్ నిర్ణయాలు ఎన్నికల వేళ ఉత్కంఠ పెంచుతున్నాయి.
అపరేషన్ నెల్లూరు:సీఎం జగన్ కు ఈ సారి నెల్లూరు జిల్లాను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. వైసీపీ ఏర్పాటు నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ముగ్గురిని వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో, నెల్లూరులో పట్టు పెంచుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వీడిన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించారు. పార్టీ సమన్వయకర్తగా సీనియర్ నేత విజయ సాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
వైసీపీ అభ్యర్ధిగా వేమిరెడ్డి:నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే రూరల్ అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ ను కలిసారు. ఆ సమయంలో ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ సూచించినట్లు సమాచారం. అందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే, కొన్ని అభ్యంతరాలు ప్రభాకర్ రెడ్డి వ్యక్తి చేసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ తీరు పైన ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అనిల్ నెల్లూరు సిటీ అభ్యర్ధిగా పోటీ చేస్తే సమస్యలు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ:నెల్లూరు ఎంపీగా వరుసగా మూడు సార్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బీదా మస్తాన రావు ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. టీడీపీ నుంచి నెల్లూరు లోక్ సభకు ఎవరు బరిలో దిగుతారనేది ఇంకా స్పష్టత రాలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎంపీగా బరిలోకి దింపటం ద్వారా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో అనిల్ పైన వేమిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో..సీఎం జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications