AP Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు - సీఎం జగన్ లెక్క పక్కా..!!
Early poll in Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుగానే ఎన్నికలు రాబోతున్నాయా. తాజా పరిణామాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి. ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ అటు పార్టీ..ఇటు పాలనా పరంగా ఎన్నికల టీంలను సిద్దం చేసుకుంటున్నారు. పార్టీలో రీజనల్ ఇంఛార్జ్ లు..పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చిన సీఎం..ఎమ్మెల్యేల పనితీరు పైన ఇప్పుడు ఫోకస్ చేసారు. అటు పాలనలో అధికారిక టీంను మార్చారు. మరి కొన్ని మార్పులకు సిద్దం అవుతున్నారు. మంత్రులు సైతం ముందస్తు ఖాయమనే అంచనాల్లో ఉన్నారు.

ముందస్తు పై మంత్రి సంకేతాలు..
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని మంత్రి అప్పలరాజు సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగానే మంత్రి ఈ వ్యాఖ్యలు చేసారనేది స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చేసామని మంత్రి వివరించారు. ఎన్నికల దిశగా పార్టీ నేతలు..కార్యకర్తలు సిద్దం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఎన్నిక ల ప్రచారంలోనే ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి చెప్పుకొచ్చారు. ఎవరు ఏ రకంగా జత కట్టినా..ఎటువంటి దుష్ఫ్రచరాలు చేసినా ముఖ్యమంత్రి గా తిరిగి జగన్ గెలవటం ఖాయమని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఎదుర్కొన్న కష్టాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికల పైన జరుగుతున్న ప్రచారానికి తాజాగా మంత్రి వ్యాఖ్యలతో మరింత స్పష్టత లభించినట్లు కనిపిస్తోంది.

సీఎం ఎన్నికల టీంలు సిద్దం..
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో..పార్టీలో తన ఎన్నికల టీంలను సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ పరంగా ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్లను మార్చారు. జిల్లా అధ్యక్షులను కొత్త వారిని నియమించారు. ఎమ్మెల్యేల విషయంలోనూ డిసెంబర్ 14న కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పరంగా ఆ రోజు నిర్వహించే వర్క్ షాప్ లో సీఎం జగన్ ఎన్నికలకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. ఇక నుంచి వారంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని పార్టీ ఆదేశించింది. ఇటు సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకంతో ముఖ్యమంత్రి ముందస్తు కు సిద్దం అవుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 జూన్ వరకు పదవీ విరమణకు సమయం ఉన్న జవహర్ రెడ్డికి.. సీనియర్లను పక్కన పెట్టి ఇప్పుడే కీలక బాధ్యతలు అప్పగించటం కూడా సీఎం ఆలోచనలను స్పష్టం చేస్తోంది. అటు డీజీపీ మార్పు పైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో..ప్రభుత్వం - పార్టీ పరంగా తన లక్ష్యం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.

ఇక జనం మధ్యకు సీఎం జగన్..
ముఖ్యమంత్రి జగన్ వరుస జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వచ్చే నెలలో పార్టీ నేతలతో కీలక సమావేశంలో ఇక పార్టీ నేతలంతా ప్రజల మధ్యనే ఉండేలా ముఖ్యమంత్రి కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. జనవరి నుంచి ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ తో పాటుగా ప్రతీ జిల్లాలో రెండు రోజులు ప్రభుత్వ - పార్టీ సమీక్షలకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంలో జనవరి లేదా ఫిబ్రవరిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర్పు ఎలా ఉన్నా.. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా సీఎం పాలన ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోంది. జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర..చంద్రబాబు జిల్లాల పర్యటన, ఆ తరువాత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర దిశగా నిర్ణయాలు జరుగుతున్న వేళ కీలక నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, 2024లో జరగాల్సి ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశాలు ఉన్నాయని మంత్రులే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications