మూడు రాజధానుల పై సీఎం జగన్ కొత్త ఫార్ములా తో ముందుకు..!!
మూడు రాజధానుల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సీజీఐ విచారణ నుంచి తప్పుకున్నారు. కొత్త ధర్మాసనం కు ఈ కేసు బదిలీ కానుంది. ఇదే సమయంలో ఇటు సీఎం జగన్ కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారు. న్యాయపరంగా ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. తాను అనుకున్న విధంగా విశాఖ నుంచి పాలన చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇందు కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎంగా తాను రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సీఎం స్పష్టం చేసారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రులు ఉంటారని..అక్కడే సచివాలయం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరో వైపు మంత్రులు సైతం త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. దీంతో, సీఎం జగన్ తన కొత్త ఫార్ములా అమలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం సంక్రాంతి ముహూర్తంగా నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పటికే సీఎం విశాఖ నుంచి పాలనకు సిద్దమవుతున్నారనే అంశం పైన చర్చ మొదలైంది.
సీఎం ఎక్కడ నుంచి అయినా పాలన చేయవచ్చనే అంశం పైన భిన్నాభిప్రాయాలు కనిపించటం లేదు. సచివాలయం కూడా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందనే వ్యాఖ్యల పైన కొందరు విభేదిస్తున్నారు. మరో వైపు ఉత్తరాంధ్ర మంత్రులు తమ ప్రాంతానికి పరిపాలనా రాజధాని వస్తుంటే టీడీపీ అడ్డుకుంటుందనే ఆరోపణలు మొదలు పెట్టారు. సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామాకు ముందుకొచ్చారు. అటు టీడీపీ సేవ్ విశాఖ పేరుతో కొత్త ఉద్యమానికి సిద్దం అవుతోంది. అటు కర్నూలులోనూ న్యాయ రాజధాని..హైకోర్టు ఏర్పాటు పైన డిమాండ్ ఊపందుకుంది.
ఇటు హైకోర్టు తాము అమరావతి రాజధాని అంటూ తీర్పు ఇచ్చిన తరువాత, సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి చూడకుండా ఈ ఆందోళనలు ఏంటంటూ ప్రశ్నించింది. ఈ నెల 9 లేదా 10వ తేదన ఏపీ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ భేటీలో సీఎం జగన్ తన ఆలోచనలను..నిర్ణయాలను సహచర మంత్రులతో షేర్ చేసుకొనే ఛాన్స్ ఉందది. అదే సమయంలో మంత్రులకు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి తాజా నిర్ణయం..అమలు విధానం పైన ఎటువంటి స్పష్టత ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.