సీఎం జగన్ రె"ఢీ" - నేడే రూట్ మ్యాప్ : 2014 పొత్తులు రిపీట్ : పదవులు- సర్వే నివేదికలు..!!
2024 ఎన్నికలకు జగన్ సిద్దం అవుతున్నారు. తన సైన్యాన్ని సంసిద్దులను చేస్తున్నారు. టార్గెట్ 2024 లక్ష్యంగా తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ఏపీలో రాజకీయ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా జనసేన అధినేత పవన్ సైతం పరోక్షంగా స్పష్టం చేసారు. వ్యతిరేక ఓటు చీలకూడదని స్పష్టం చేసారు. వైసీపీ పైన పోరాటానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తుందని చెప్పటం ద్వారా.. 2014 పొత్తులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని అంచానలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ, వైసీపీ మాత్రం ఒంటరి పోరు చేయనుంది.ఈ సమయంలో 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక సమావేశం ఏర్పాటు చేసారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేసేందుకు ముందుకు వెళ్తున్నారు.

నేడే వైసీపీ శాసనసభా పక్ష సమావేశం
అందులో భాగంగా.. వైసీపీ ఎమ్మెల్యేలో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం కీలకంగా మారింది. ప్రభుత్వంలో చేయనున్న మార్పులు..పార్టీ పరంగా తీసుకోబోయే నిర్ణయాల పైన సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం మార్పుల పైన సీఎం స్పష్టత ఇచ్చారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి కొత్త జిల్లాలు ఏర్పడుతుండటంతో అక్కడ పార్టీ ఇన్ ఛార్జ్ లుగా వారిని నియమించాలని సీఎం నిర్ణయించారు.
అదే విధంగా మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ ఇవ్వనున్నారు. మంత్రి పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో..ఏ అంశాల ప్రాతిపదికన అవకాశాలు కల్పించేదీ సీఎం ఓపెన్ గా చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటుగా..వచ్చే ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రం నుంచి జిల్లా ముఖ్య కేంద్రం వరకూ పార్టీలో వ్యవస్థా పరంగా కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ పైనా క్లారిటీ
అందులో భాగంగా కొత్త జిల్లాల ఆధారంగా.. ప్రతీ జిల్లాకు ప్రస్తుతం పదవులు కోల్పోయే మంత్రులను జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నారు. అదే విధంగా ప్రతీ జిల్లాకు అధ్యక్షుడు - ఎంపీ - ఏడుగురు ఎమ్మెల్యేలు జిల్లా కమిటీగా పని చేయనున్నారు. అదే విధంగా ప్రతీ నియోజకవర్గానికి కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇక, జూలై 8వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. అందులో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు మూకుమ్మడిగా రాజకీయంగా దాడి కొనసాగిస్తున్న సమయంలో.. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం కీలకం కానుంది. అదే విధంగా.. ప్రభుత్వ పథకాల అమలు పైన ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం సూచించనున్నారు.

సీఎంతో సహా పార్టీ నేతలంతా ప్రజల్లోనే
సాధ్యమైనంత వరకు ప్రజల్లోనే ఉండాలని .. జిల్లా పార్టీ అధ్యక్షులు.. మంత్రులు.. ప్రతీ జిల్లాలోనూ పార్టీ కార్యక్రమాల నిర్వహణకు రూప కల్పన చేయాలని సీఎం నిర్దేశించనున్నట్లు సమాచారం. 2014 ఎన్నికలు ఏపీలో రిపీట్ అవ్వటం ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇదే సమయంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించటంతో...వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తమ బలం తగ్గకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేల పైనే సీఎం పెట్టే అవకాశం ఉంది. అదే విధంగా తాను ప్రజల్లోకి వచ్చే అంశం.. జిల్లాల పర్యటనల పైనా సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. ప్లీనరీ నుంచి ఇక సీఎం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.

పొత్తులు - రూట్ మ్యాప్ పై స్పష్టత
అయితే, మంత్రివర్గ విస్తరణలో తిరిగి అయిదు ఉప ముఖ్యమంత్రి పదవులు.. సామాజిక సమీకరణాలు.. జిల్లాల వారీగా స్థానిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని సీఎం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతూనే...కొత్త మంత్రులు ఒకే సారి విధులు ప్రారంభించేలా సీఎం తన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో..టీడీపీతో సహా ఇతర పార్టీల నిర్ణయాలకు కౌంటర్ గా సీఎం ఈ భేటీ ద్వారా 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఎమ్మెల్యేలకు రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. వచ్చే ఎన్నికల దిశగా సీఎం ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు..ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఇప్పుడు వైసీపీలోకే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications