జంగారెడ్డిగూడెంలో సారా అసాధ్యం : 26 మందివి సాధారణ మరణాలే.! కామన్ సెన్స్ లేని టీడీపీ-అసెంబ్లీలో జగన్ !!
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న నాటుసారా మృతుల సంఘటన ఏపీ రాజకీయలో పెద్ద దుమారం రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. సారా మరణాలన్నీ జగన్ ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నాటు సారా తాగి 26 మంది చనిపోతే.. అవన్ని సహజ మరణాలుగానే ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఈ ఘటనపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుపట్టారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. జరగని ఘటనలను కూడా జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు.

టీడీపీ సభ్యులకు సభ్యత లేదు..
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జంగారెడ్డి గూడెంలో మరణాలపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సారాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మద్యానికి అడ్దుకట్టవేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రెండేళ్లలోనే సుమారు 13 వేల కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సారా కాసేవాళ్లకు తమ ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం లేదన్నారు.

జంగారెడ్డిగూడెంలో సారా కాయడం అసాధ్యం..?
అసలు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ జనాభా 55 వేలు. అలాంటి చోట నాటు సారా కాయడం సాధ్యమవుతుందా ? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎప్పుడూ నిఘా ఉంటుంది. పోలీస్ స్టేషన్ ఉంది. వార్డు సచివాలయం, కార్పొరేటర్లు ఉన్నారు. ఇలాంటి మున్సిపాలిటీలో ఎవరైనా నాటు సారా కాస్తారా ? అని నిలదీశారు. ఏదో మారుమూల ప్రాంతాల్లో సారా కాస్తున్నారంటే ఆలోచించవచ్చు. కానీ ఇంత మంది జనభా ఉన్న చోట సారా కాయడం అసాధ్యమన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. ప్రజలు నమ్మేవిధంగా ఉండలంటూ టీడీపీపై జగన్ మండిపడ్డారు.
Recommended Video

కామన్ సెన్స్ లేకుండా ఆరోపణలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అసలు ఆయనకైనా తెలుస్తుందా ? అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ మెదడుకు పదును పెట్టి ఆలోచించాలని హితవు పలికారు. కామన్ సెన్స్ లేకుండా తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సాధారణ మరణాలపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాన్ని నిజం చేయడానికి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జరగని సంఘటన జరిగినట్లు విషప్రచారం చేస్తున్నారు. ప్రజలు వీరిని క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications