సీఎం జగన్ మార్క్ డెసిషన్స్ - టీడీపీ కంచుకోటల్లో కొత్త స్కెచ్..!!
వైనాట్ 175. సీఎం జగన్ ఎన్నికల దిశగా అడుగుల వేగం పెంచారు. పార్టీ ప్రక్షాళన పైన ఫోకస్ పెట్టారు. టీడీపీ నియోజకవర్గాలపై దూకుడు పెంచారు. కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ గీత దాటుతున్న వారి పైన వేటు వేస్తున్నారు. తాజాగా, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి జలక్ ఇచ్చారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరికి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించారు. అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హిందూపురం, గన్నవరం వంటి నియోజకవర్గాల్లోనూ నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

ఆనం రూటు మారింది - వేటు పడింది
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం చాలా కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. తొలుత జిల్లాలో పార్టీ వ్యవహారాలు - అధికారుల తీరు పైన వ్యాఖ్యలు చేసిన ఆనం, ఇప్పుడు నేరుగా ప్రభుత్వం పైన కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనే ఈ రకమైన వ్యాఖ్యలకు సంబంధించి ఆనం ను హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పుడు సంక్షేమ పథకాలే ఆయుధంగా ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ, సొంత పార్టీ ఎమ్మెల్యేనే వాటి గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయటానికి వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతోందని, అదే జరిగితే ఏడాది ముందే పార్టీ ఇంటికి వెళ్లటం ఖాయమంటూ ఆనం చేసిన వ్యాఖ్యలతో హైకమాండ్ సీరియస్ అయింది. ఆనం మరో పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో, తన వ్యాఖ్యలతో సంచలనంగా మారిన కోటంరెడ్డితో చర్చించిన సీఎం జగన్.. ఆనంతో అవసరం లేదని భావించినట్లు కనిపిస్తోంది. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి అప్పగించారు.

చీరాలలో కరణం - పర్చూరుకు ఆమంచి
2019 ఎన్నికల్లో చీరాల నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమంచి ఓడిపోయారు. ఆయన పైన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం గెలుపొందారు. ఆ తరువాత కరణం బలరాం తన కుమారుడితో కలిసి వైసీపీకి దగ్గరయ్యారు. అక్కడ కరణం బలరాం, ఆమంచి మధ్య నియోజకవర్గంలో ఎవరికి సీటు అనే అంశం పైన డైలమా కొనసాగుతోంది. ఈ సమయంలో ఆమంచితో పార్టీ నాయకత్వం మాట్లాడింది. చీరాల ను కరణంకు కేటాయించాలని నిర్ణయించింది. పార్టీ నిర్ణయానికి ఆమంచి కూడా అంగీకరించారు. దీంతో, ఆమంచికి పర్చూరు బాధ్యతలు కేటాయించారు. పర్చూరులో కొంత కాలంగా పలువురి నేతల పేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే, జిల్లా నేతలతో చర్చించిన తరువాత ఆమంచి పేరు పర్చూరుకు ఫైనల్ చేసారు. 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు పర్చూరు ఇంఛార్జ్ గా ఆమంచిని నియమిస్తూ పార్టీ అధికారికంగా నిర్ణయం ప్రకటించింది.

కీలక నియోజకవర్గాల్లోనూ నిర్ణయాల దిశగా
కొత్త ఏడాది ప్రారంభంలోనే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల ప్రక్షాళన దిశగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా..టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నెలకొన్న సందిగ్దతకు క్లారిటీ ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్ధినని ప్రకటించుకున్నారు. వైసీపీలోని ఇద్దరు ముఖ్య నేతలు కూడా రేసులో ఉన్నారు. త్వరలోనే గన్నవరం నియోజకవర్గంపై సమీక్ష ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా హిందూపురంలోనూ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సమయంలోనూ నేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి. దీంతో, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం, ఉరవకొండ. పెనుకొండ నియోజకర్గాలైన సంక్రాంతి లోగా పార్టీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు.. సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications