టీడీపీ కంచుకోటలో సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ - మారుతున్న లెక్కలు..!!
ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీట్లు రాని కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో కీలకమైన కృష్ణా,గుంటూరు జిల్లాల్లో సీట్ల ఖరారు పైన జగన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ అగ్ర నాయకత్వానికి అందుబాటులోకి రావటం లేదు. మాజీ మంత్రి అమర్నాధ్ కు సీటు విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదలైన జంపింగ్స్:ఏపీలో ఎన్నికల వేళ పార్టీల్లో జంపింగ్స్ మొదలయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి కొద్ది రోజులుగా పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం సాగింది. సామాజిక బస్సు యాత్ర సభలో తనను సీఎం పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనను పార్ధసారధి ఖండించారు. కానీ, ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్ ల మార్పు సమయంలో పార్ధసారధిని క్యాంపు కార్యాలయానికి రావాలని పార్టీ నాయకత్వం నుంచి సమాచారం వెళ్లింది. అయినా పార్ధసారధి నుంచి స్పందన లేదని తెలుస్తోంది.

కేశినేని రాజీనామాతో:అయితే, పెనమలూరు స్థానం వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు టీడీపీ కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో, టీడీపీ నుంచి మరో స్థానంలో పోటీకి ఆపర్ ఇచ్చిందనే ప్రచారం ఇంకా వినిపిస్తోంది. ఈ సమయంలో పార్ధసారధి పార్టీ మార్పు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే కృష్ణా జిల్లాలో సీట్ల మార్పు పైన ఈ రోజు లేదా రేపు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మైలవరం నుంచి తిరిగి వసంతకు సీటు ఖాయమని చెబుతున్నారు. విజయవాడ లోక్ సభ స్థానంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేయటంతో అక్కడ సమీకణాలు మారుతున్నాయి. కేశినేనితో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుంచి అనూహ్య నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
జగన్ కొత్త లెక్కలు:మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్థానంలో అనకాపల్లి స్థానం ప్రసన్న కుమార్ కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో, ఇప్పుడు అమర్నాద్ ను వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెందుర్తిలో కాపు, వెలమ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి జనసేన అభ్యర్దిగా పంచకర్ల బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. టీడీపీకి తొలి నుంచి కలిసి వస్తున్న విజయవాడ, విశాఖ పరిధిలోని నియోజకవర్గాల్లో జగన్ సామాజిక లెక్కలతో కొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాజిక లెక్కలతోనే టీడీపీ, జనసేనను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నారు. విజయవాడ పరిధిలో టీడీపీలో అంతర్గత వ్యవహారాలు మొత్తం ఫలితాల పైనే ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications