న్యూ ఇయర్ వేడుకలు: అధికారులతో సీఎం: దూరంగా చంద్రబాబు..ఎందుకంటే..!
నూతన సంవత్సర వేడుకలకు ఏపీలో సాధారణ ప్రజానీకం సిద్దమవుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఒక రకంగా..ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో విధంగా వేడుకల పైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకు అధికారం తెచ్చిపెట్టిన 2019 ను తీపి గుర్తులతో వీడ్కోలు పలుకుతూ..కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నిర్ణయించారు.
అందు కోసం అధికారులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ సారి కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఆయన మాత్రమే కాదు..మొత్తంగా టీడీపీ ఈ సారి కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకుంది.

అధికారుల మధ్య సీఎం జగన్..
నూతన సంవత్సర వేడుకలను ఈ రోజు రాత్రి అధికారుల మధ్య..జవనరి 1వ తేదీన మంత్రులు..పార్టీ నేతలు..అధికారుల మధ్య జరుపుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగా..శాసనసభా శీతా కాల సమావేశాల ముగింపు రోజున మంత్రులు..పార్టీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు..అధికారులతో ముఖ్యమంత్రి విందు ఇచ్చిన వేదికనే ఇప్పుడు నూతన సంవత్సర వేడకులకు వేదికగా ఖరారు చేసారు.
ఈ రోజు రాత్రి సీఎం జగన్ నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ఐఏఎస్ అధికారులు విజయవాడలోని బెరం పార్కులో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఆయన ఈ వేడుకల్లో పాల్గొంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.

వేడుకలకు చంద్రబాబు దూరం
నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆయనతో పాటుగా పార్టీ మొత్తంగా దూరంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. పార్టీ నేతలు, సానుభూతిపరులు దీనిని పాటించి ఆ ఖర్చులు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీలకు విరాళంగా ఇవ్వాలని సూచించారు. తనకు ఎవరూ బొకేలు..కేకులు తీసుకురావద్దని కోరారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు, పనులు కోల్పోయిన కూలీలకు ఆ రోజున అందరూ సంఘీభావంగా నిలబడాలని చంద్రబాబు కోరారు. ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదని పేర్కొన్నారు.

పవన్ అమరావతిలోనే ఉండే ఛాన్స్..
ఇక, జనసేన అధినేత ప్రస్తుతం ఈ రోజు అమరావతి రైతులకు సంఘీభావంగా రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. నూతన సంవత్సర వేడుకల పైన ఆయన నిర్ణయం ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉంది. ఆయన పార్టీ నేతలతో కలిసి వేడుకలు జరుపుకుంటారా..లేక చంద్రబాబు తరహాలోనే రాజధాని రైతులకు సంఘీభావంగా వేడుకలకు దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఈ రోజు రాజధాని గ్రామాల్లో పవన పర్యటన పూర్తయిన తరువాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications