సీఎం జగన్..బొత్సా మధ్య గ్యాప్!! తగ్గిన ప్రాధాన్యత..అసంతృప్తితో సత్తిబాబు: అదేనా అసలు కారణం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో బొత్సా సత్యనారాయణ సీనియర్ మంత్రి. నాడు వైయస్కు ఆప్తులు. అటువంటి సీనియర్ నేత అయిన బొత్సా సత్యనారాయణ వైసీపీలో చేరారు. జగన్ విజయనగరం జిల్లాలో పాదయాత్ర సమయంలో కీలకంగా వ్యవహరించారు. అదే విధంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక సందర్బాల్లో ప్రభుత్వ విధానాలను తప్పు బట్టారు. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి..ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయటానికి బొత్సా కృషి ఉంది. దీంతో..జగన్ సైతం ఆయన కంటే ముందుగా జిల్లాలో పార్టీలో చేరిన వారు ఉన్నా..సమర్ధత గుర్తించి బొత్సా కు మంత్రి పదవి..అందునా కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. అయితే, కొద్ది రోజులకే ముఖ్యమంత్రి..మంత్రి బొత్స మధ్య గ్యాప్ బయట పడింది. బొత్సా సైతం తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. అసలు బొత్సా చేసిందేంటి..ముఖ్యమంత్రి ఎందుకిలా..

బొత్సాకు తొలి నుండి ప్రాధాన్యత...
మంత్రి బొత్సా సత్యనారాయణ వైయస్ హయాంలో రెండు విడతల్లోనూ మంత్రిగా పని చేసారు. పరిశ్రమల శాఖ మంత్రి గా ఉన్న సమయంలో వోక్స్వాగన్ అవినీతి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా..నాడు ముఖ్యమంత్రిగా వైయస్ మంత్రి బొత్సాకు మద్దతుగా నిలిచారు. వైయస్ మరణం తరువాత ముఖ్యమంత్రులు చేసిన రోశయ్యు బొత్సా సహకరించినా.. కిరణ్ తీరు పైన మాత్రం అంతర్గతంగా అసమ్మతి వ్యక్తం చేసేవారు. పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో సోనియా కు విధేయుడిగా ఉంటూ..కిరణ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మాట కాదనటంతో ముఖ్యమంత్రి పదవి ఆశించారు. ఇక..కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు. అంతకు ముందు జగన్ పైన అనేక విమర్శలు చేసారు. పార్టీలో చేరిన తరువాత జగన్ మద్దతుదారుడిగా టీడీపీ మీద ఫైర్ అయ్యేవారు. ఇక, విజయనగరంలో జిల్లాలో బొత్సాకు రాజకీయంగా ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకొని బొత్సాకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన కోరిన విధంగా తాజా ఎన్నికల్లో సీట్లను కేటాయించారు. మంత్రి పదవి కట్టబెట్టారు.

బొత్సాకు ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిస్తూ..
ఇక, ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమయంలో బొత్సాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ఇక గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు..కాంట్రాక్టులు పరిశీలన కోసం సీఎం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. రాజధానికి సంబంధించిన టెండర్లను ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆ కమిటీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంపీలకు అవకాశం ఇచ్చారు. కానీ, బొత్సాకు అందులో స్థానం ఇవ్వలేదు. అదే విధంగా తాజాగా కాపు రిజర్వేషన్ల అంశం మీద గత ప్రభుత్వం ఈడబ్ల్యూయస్ కోటాలో కాపులకు ఇచ్చిన అయిదు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ విషయంపై రాజకీయంగా దుమారం చెలరే గటంతో ముఖ్యమంత్రి జగన్ ఈ అంశం పైన అధ్యయనానికి అదే విధంగా మంజునాధ కమిషన్ నివేదిక పరిశీలన కోసం ముగ్గురితో కమిటీ వేసారు. అందులో ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లుతో పాటుగా అంబటి రాంబాబు..తొలి సారి మంత్రి అయిన కురసాల కన్నబాబుకు అవకాశం ఇచ్చారు. బొత్సాను మాత్రం ఆ కమిటీలో నియమించలేదు.

అసలు కారణం అదేనా..
విజయనగరం జిల్లాలో బొత్సాను మంత్రిని చేసి..అప్పటికే పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసిన కొలగట్ల వీరభద్ర స్వామికి సీఎం మంత్రి పదవి నిరాకరించారు. తాజాగా బొత్సా నలుగురు డిఎస్పీల బదిలీల కోసం సిఫార్సు చేసినా వాటిని పరిగ ణలోకి తీసుకోలేదని సమాచారం. అదే సమయంలో రాజధాని విషయాల్లోనూ బొత్సా మాట కంటే అధికారుల సూచనల వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇక, అన్నా క్యాంటీన్ల విషయంలో మంత్రి బొత్సా ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. సభలో చేసిన ప్రకటన ఒక రకంగా..బయట చిట్చాట్లో మరో రకంగా మాట్లాడటం పైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్ మంత్రిగా బొత్సాకు గౌరవం ఇస్తున్నా..పార్టీ పరంగా..రాజకీయంగా మాత్రం ముఖ్యమంత్రి కొంత దూరం పెట్టినట్లు తెలుస్తోంది. బొత్సా గత వ్యవహార శైలే దీనికి కారణంగా చెబుతున్నారు.
అదే విధంగా బొత్సాకు అధిక ప్రాధాన్యత ఇస్తే పార్టీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి బొత్సా పైన అందిన సమాచారం మేరకే కొంత గ్యాప్ మెయిన్టెయిన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..బొత్సా సైతం సభలో.. బయటా గతంలో లాగా యాక్టివ్గా కనిపించటం లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే చర్చ అటు పార్టీలో..ఇటు ప్రభుత్వంలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications