పురంధేశ్వరికి సీఎం జగన్ బంపరాఫర్: వైసీపీలోకి వస్తే ఆ పదవి : దగ్గుబాటి కుటుంబంలో అంతర్మధనం..!
కొద్ది రోజులుగా వైసీపీలో సాగుతున్న పర్చూరు రగడ కొత్త టర్న్ తీసుకుంది. దగ్గుబాటి వేంకటేశ్వర రావు గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశం మీద చర్చ సాగింది. అయితే..అదే సమయంలో బీజేపీ నేతగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్యమంత్రి మీద చేస్తున్న విమర్శల గురించి చర్చ సాగింది. మీరు వైసీపీలో ఉండగా.. మీ సతీమణి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం..అందునా టీడీపీ నేతలు చేస్తున్న వాటికే కొనసాగింపుగా అన్నట్లుగా ఆరోపణలు చేయటం పైన ముఖ్యమంత్రి జగన్ మనస్థాపానికి గురైనట్లుగా చెప్పుకొచ్చారు.
దీంతో..దగ్గుబాటి వేంకటేశ్వరావుతో జగన్ ఒక ప్రతిపాదన తెచ్చారు. పురంధేశ్వరి సైతం వైసీపీలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తానని ఆఫర్ చేసారు. దీని పైన చర్చించిన తరువాతనే తాను సమాధానం చెప్పగలనని వేంకటేశ్వర రావు సమాధానమిచ్చారు. ఆ తరువాత జరిగిన కొన్న పరిణామాలతో నిర్ణయం పెండింగ్ పడింది.

వైసీపీలో చేరితే రాజ్యసభ సీటు..
దగ్గుబాటి వేంకటేశ్వరరావు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నప్పటికీ ..పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు. ఎన్నికల సమయంలో ఆయన తనయుడుకి జగన్ సీటు ఇవ్వాలని భావించినా.. ఆయనకు పౌరసత్వ సమస్య అడ్డుగా మారటంతో చివరి నిమిషంతో వేంకటేశ్వరరావుకు సీటు కేటాయించారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం దగ్గుబాటి నేరుగా జగన్ ను కలిసారు. ఆ సమయంలో పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శల పైన చర్చ జరిగింది. జగన్ నేరుగా మీ సతీమణి సైతం వైసీపీలోకి వస్తే తగిన గుర్తింపు దక్కేలా రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని..అమెతో చర్చించి నిర్ణయం చెబుతానని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండి ఈ విషయం పైన ఎటువంటి నిర్ణయం జరగలేదు.

రామనాధం బాబుకు పదవి..
అదే సమయంలో పర్చూరుకు చెందిన రామనాధం బాబును వైసీపీలో చేర్చుకున్న జగన్ ఆయనకు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్ష పదవి కేటాయించారు. పరోక్షంగా పర్చూరు బాధ్యతలను చూసేకోవాలనే సంకేతాలను ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగింది. దీని ద్వారా ఇక, దగ్గుబాటి వేంకటేశ్వరరావును ముఖ్యమంత్రి వదులుకున్నట్లుగా జిల్లాలో విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, వేంకటేశ్వరరావు మాత్రం ఇంకా అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయలేదు. జగన్ ఇచ్చిన ఆఫర్ మీద పురంధేశ్వరి స్పందన ఏంటనేది తెలియలేదు. అయినా.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం మరి కొంత సమయం వేచి చూసే ధోరణితోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కావటంతో పార్టీలోకి వస్తే రాజకీయంగా టీడీపీ పైన పైచేయి సాధించవచ్చన్నది జగన్ అభిప్రాయం. ఎన్టీఆర్ కుమార్తెకు రాజ్యసభ ఇవ్వటం ద్వారా రాజకీయంగా..సామాజిక వర్గాల పరంగా మద్దతు పెరుగుతోందని భావిస్తున్నారు.

దగ్గుబాటి కోర్టులో బాల్..
ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం తేల్చి చెప్పటంతో ఇక ఇప్పుడు భవిష్యత్ తేల్చుకోవాల్సింది దగ్గుబాటి దంపతులే. పురంధేశ్వరి వైసీపీలోకి రావటానికి అంగీకరిస్తే వేంకటేశ్వరావు సైతం కొనసాగటంతో పాటుగా రాజ్యసభ దక్కనుంది. పురందేశ్వరి వైసీపీలోకి రావటానికి సుముఖంగా లేకపోతే..వేంకటేశ్వర రావు సైతం వైసీపీ వీడుతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ సమయంలోనే పర్చూరుకు చెందిన వైసీపీ నేతలు జిల్లా మంత్రి బాలినేనిని కలిసి పర్చూరు ఇన్ ఛార్జ్ గా దగ్గుబాటిని కొనసాగించాలని కోరారు. అయితే, పర్చూరు వ్యవహారం నేరుగా ముఖ్యమంత్రి వద్ద ఉందని..వేంకటేశ్వరరావు నుండి వచ్చే స్పందన ఆధారంగా అక్కడ మార్పులు..చేర్పులు జరిగే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు.
English description












Click it and Unblock the Notifications