పర్యటనల హోరు.. జగనన్న జోరు!
ఏపీ సీఎం జగన్ జోరుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో పర్యటించిన జగన్ ఈనెల 11న పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్లో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ప్రారంభిస్తారు. ఈ యూనిట్ ను ఐటీసీ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం తర్వాత గుంటూరు నగరంలో పర్యటిస్తారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం గుంటూరు మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. జీఎంసీ ఏర్పాటై 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్ను ఆవిష్కరిస్తారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ తన పర్యటనలను ప్రణాళికా బద్ధంగా రూపొందించుకుంటున్నారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, రాబోయే వేసవిలోకానీ, డిసెంబరులోకానీ జరుగుతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు.
మరోవైపు రానున్న ఎన్నికల్లో రెండోసారి విజయకేతనం ఎగరవేసేందుకు జగన్ వ్యూహాలను రచించుకుంటున్నారు. కొవిడ్ తర్వాత పరిస్థితులున్నీ సాధారణ స్థితికి చేరుతుండటంతో తన పర్యటనలను కూడా పెంచుతున్నారు. జిల్లాలవారీగా అభివృధి పనులకు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులద్వారా అర్బన్ ఓటింగ్ ను కూడా వైసీపీవైపు తిప్పేలా సీఎం వ్యూహరచన చేస్తున్నారు. తన ప్రణాళికకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.