పారిస్ పర్యటనకు సీఎం జగన్ - కుమార్తె చేతికి పట్టా అందే వేళ..!!
ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. గత నెలలో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్..ఇప్పుడు పారిస్ పర్యటనకు వెళ్తున్నారు. పూర్తిగా పర్సనల్ టూర్ కానుంది. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షరెడ్డి పారిస్లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. పారిస్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షరెడ్డి వచ్చే నెల 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి సీఎం తో పాటుగా కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఆ వెంటనే సీఎం తిరిగి రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
వచ్చే నెల 4వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండటంతో.. పారిస్ లో కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం తిరుగు పయణం అవుతారని తెలుస్తోంది. ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్షారెడ్డి.. పారిస్ లోని ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దక్కింది. ఆ సమయంలోనూ సీఎం జగన్ బెంగుళూరు వెళ్లి కుమార్తెను పారిస్ పంపారు. ఇక, ఇప్పుడు కాన్వకేషన్ లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఇక, జూలై 8న వైఎస్సార్ జయంతి..8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీంతో.. పారిస్ పర్యటన తరువాత సీఎం జగన్ షెడ్యూల్ బిజీగా మారింది.