ఉగాది నుంచి జగన్ రచ్చబండ- ముహుర్తం ఖరారు- సంక్షేమం ఫీడ్బ్యాక్ కోసమే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వందకు పైగా పథకాలు ప్రారంభించారు. వీటి అమలు ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాత్రం సీఎం జగన్కు వీలు కుదరడం లేదు. దీంతో అధికారులు, ఇంటిలిజెన్స్ నివేదికలపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. దీంతో త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉగాది నుంచి రచ్చబండ కార్యక్రమం ప్రారంభించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు.
వైఎస్ రచ్చబండ ఆలోచన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసిన అతి కొద్ది ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒకరు. ఆయన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ దేశంలోనే అగ్ర రాష్టాల్లో ఒకటిగా నిలిచింది. పేదలకు ఏం కావాలో తెలుసుకుని వాటిని కచ్చితంగా అమలు జరిగేలా చూడటం ద్వారా వైఎస్ సంక్షేమ ప్రభుత్వ రథసారధిగా నిలిచారు. దీంతో ఆయన తర్వాత కూడా అవే సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు పేరు మార్చి అమలు చేసుకోవడం లేదా అంతకు మించిన పథకాలే అమలు చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే తన హయాంలో పథకాలకు అంత మంచి పేరు వచ్చినా ఇంకా పకడ్బందీగా అమలవుతున్నాయా లేదా తెలుసుకునేందుకు రచ్చబండ పేరుతో ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసినా.. దాన్ని అమలు చేసేందుకు బయలుదేరి ఆయన దుర్మరణం చెందారు.
జగన్ రచ్చబండ ఆలోచన
వైఎస్ హయాంలో ఆయన మొదలుపెట్టాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన తనయుడు, సీఎం జగన్ ప్రారంభిస్తారని అంతా భావించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఈ పథకం ప్రారంభమవుతుందని అంతా అనుకున్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. రచ్చబండ చేపట్టాలంటే క్షేత్రస్దాయిలో పర్యటించాల్సి ఉంటుంది. అయితే అదికారంలోకి వచ్చిన తొలి ఆరునెలలూ సంక్షేమ పథకాల ప్రారంభంలో బిజీగా ఉన్న సీఎం జగన్.. ఆ తర్వాత కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. మధ్యలో ఒకటీ అరా సంక్షేమ పథకాల ప్రారంభాల కోసం బయటికి వచ్చినా ఇప్పటికీ అన్నీ క్యాంపు కార్యాలయం నుంచే జరుగుతున్నాయి.
జగన్ సంక్షేమ పథకాలు చివరి దశకు
నవరత్నాల అమల్లో భాగంగా వైసీపీ సర్కారు తీసుకొస్తున్న సంక్షేమ పథకాల జాతర చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా పథకాల అమలు ప్రారంభమైంది. ఇక మిగిలిన ఒకటీ అరా పథకాలు త్వరలో ప్రారంభించేసి అనంతరం వాటిపై సమీక్షకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్ధాయిలో రచ్చబండ నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలుపై లబ్ది దారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. ఇందుకోసం రచ్చబండ కార్యక్రమం ప్రారంభానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉగాది నుంచి జగన్ రచ్చబండ
ఈ ఏడాది ఏప్రిల్ 13న ఉగాది పండుగ వస్తోంది. అప్పటి కల్లా నవరత్నాల పథకాల ప్రారంభోత్సవం పూర్తయిపోతే వాటి అమలుపై వివరాలు తెలుసుకునేందుకు జగన్ రచ్చబండ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉగాది రోజున రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు అదికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. గతంలో తన తండ్రి వైఎస్ ప్రారంభించాల్సిన రచ్చబండను జగన్ ప్రారంభిస్తుండటం కూడా ప్రాదాన్యం సంతరించుకుంది.