జగనన్న వదిలిన బాణం డిల్లీ రాజకీయాల్లోకి..! పార్టీ సీనియర్లతో మంతనాలు: షర్మిళకు కీలక పదవి..!
బైబై బాబు నినాదంతో ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన షర్మిళ అనుకున్నది సాధించారు. తన అన్నను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు షర్మిళ పడిన కష్టం విజయమ్మే వివరించారు. తండ్రి మరణం తరువాత జగన్ కష్టాల్లో ఉన్న సమయంలో చెల్లిగా కంటే జగన్కు అన్నగా తోడు నిలిచారు. సీబీఐ కేసులతో అర్దాంతంగా నిలిచిన ఓదార్పు యాత్ర ను కొనసాగించారు. రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి వైయస్ బిడ్డనని నిరూపించారు. అన్న కోసం నాడు తల్లితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక..తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎలాగైనా తన అన్ని సీఎం కావాలనే లక్ష్యంతో టీడీ పీ అధినేత చంద్రబాబు..లోకేశ్ పైన గురి పెట్టి వాగ్బాణాలు సంధించారు. తన కోసం అండగా నిలిచిన వారికి పిలిచి మరీ పదవులు ఇస్తున్న జగన్..ఇప్పుడు షర్మిళ విషయంలో ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
షర్మిళకు పదవి పైన జగన్ చర్చలు..
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పిలిచి పదవులు ఇస్తున్నారు. తన పైన పెట్టిన అక్రమ కేసుల కారణంగా తనతో పాటుగా జైలు జీవితం గడిపిన మోపిదేవి ఎన్నికల్లో ఓడినా పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అదే విధంగా కేసుల్లో జైలు శిక్ష అనుభ వించి..జగన్ కారణంగా జైలు పాలయి మంచి భవిష్యత్ను కోల్పోయిందనే భావనతో ఉన్న ఐఏయస్ అధికారణి శ్రీలక్ష్మి ని ఏపీలో పని చేసేందుకు అవకాశం కల్పించారు. శ్రీలక్ష్మిని రిలీవ్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను కోరారు. ఆ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో విజయ సాయి రెడ్డికి ఆ ఫైల్ క్లియర్ చేయించే బాధ్యత అప్పగించారు. ఆ క్రమంలో శ్రీలక్ష్మిని తోడ్కొని ఆయన నేరుగా ప్రధాని..హోం మంత్రి అమిత్ షాను కలిసారు. శ్రీలక్ష్మి అభ్యర్ధన మేరకు ఫైల్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో తన కోసం ఎన్నో కష్టాలు పడి.. పాదయాత్ర చేసి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని..తనకు అండగా నిలిచిన సోదరి షర్మిళకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యులతో చర్చలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
షర్మిళకు జాతీయ రాజకీయాల్లో అవకాశం..
వైసీపీలో ఇప్పుడు జగన్ ఒన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారు. పార్టీ..ప్రభుత్వ బాధ్యతలు ఆయనే చూసుకోవాల్సి వస్తోంది. దీంతో..జాతీయ స్థాయిలో వైసీపీకి గుర్తింపు వచ్చేలా అడుగులు వేయాలని జగన్ ఆలోచన. లోక్సభలో 22 సీట్లు సాధించటం ద్వారా నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో..పార్లమెంట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సాయం తప్పని సరి. కేంద్రంతో గొడవలకు జగన్ సిద్దంగా లేరు. అదే సమయంలో బీజేపీతో దగ్గరయ్యేందుకు చంద్రబాబు లోపాయి కారీగా వ్యవహరిస్తున్నారనేది జగన్ అనుమానం. దీంతో కేంద్రంలో సైతం కీలకంగా ఎదగాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజయ సాయిరెడ్డి వైసీపీ నుండి ఢిల్లీ స్థాయిలో కీలకం గా వ్యవహరిస్తున్నా..మొత్తం భారం ఆయన మీదే వేయటం సరి కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ సమయంలోనే వైయస్ కుమార్తెగా..జగన్ సోదరిగా ఢిల్లీ రాజకీయాల్లోకి షర్మిళను పంపాలనే ఆలోచన జగన్ చేస్తున్నారు. దీని పైన పార్టీ ముఖ్యులతో జగన్ ఇప్పిటికే అభిప్రాయ సేకరణ చేసినట్లు సమాచారం.
ఢిల్లీలో అధికార ప్రతినిధిగా అవకాశం...
ఇప్పటికే విజయ సాయిరెడ్డికి అనేక పదవులు ఉన్నాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా..ఢిల్లీలో ఏపీ అధికార ప్రత్యేక ప్రతినిధిగా.. మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో షర్మిళకు ప్రస్తుతం విజయ సాయిరెడ్డి వద్ద ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని షర్మిళకు ఇచ్చే అంశం పైన జగన్ దృష్టి సారించారు. దీనికి విజయ సాయి రెడ్డి సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వైయస్ హాహాభావాలు..ఆంగ్ల బాష మీద పట్టు ఉండటంతో షర్మిళ ఈ పదవి సమర్ధవంతంగా నిర్వహించగలరని జగన్ విశ్వసిస్తున్నారు. అయితే, ఈ నియామకం ద్వారా కొత్తగా ఏమైనా విమర్శలు ఎదురవుతాయా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. తనకు రాజీయాల్లోకి వచ్చే ఆలోచ న లేదని షర్మిళ గతంలో స్పష్టం చేసారు. అయితే, ఏపీకి - కేంద్రానికి మధ్య వారధిగా ఉండే పదవి ఆఫర్ చేస్తున్న ఈ సమయంలో షర్మిళ మీద జగన్ కీలక బాధ్యతలు పెడుతున్నట్టే. మరి..ఈ విషయం జగన్..షర్మిళ ఫైనల్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.