నేడే అమ్మఒడి నిధులు - శ్రీకాకుళంలో సీఎం జగన్ : 51 వేల మందికి డ్రాప్..!!
ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక అమ్మఒడి మూడో విడత ఈ రోజు శ్రీకాకుళంలో ప్రారంభం కానుంది. సీఎం జగన్ శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మఒడి పథకం లబ్ధిదారులతో మాట్లాడతారు. నవరత్నాల్లో భాగంగా వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 43.96 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ 6594.6 కోట్ల రూపాయాలను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లోనూ అమ్మఒడి కార్యక్రమం అమలు కానుంది.

వరుసగా మూడో విడత నిధులు
ఈ పథకం ద్వారా మొత్తం 82,31,502 మందికి లబ్ది అందుతోంది. నేడు అందించే సాయంతో కలిపి ఈ పథకానికి ఇప్పటి వరకు రూ 19,618 కోట్లును ప్రభుత్వం నిధుల విడుదల చేసింది. 2019లో అధికారంలోకి వచ్చే ముందు ప్రకటించిన నవరత్నాల్లో సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పథకం ఇది. తొలుత ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకే పరిమితం చేయాలని భావించినా..ఆ తరువాత ప్రయివేటు స్కూళ్లలో చదివే వారికి విస్తరించారు. ఒక్క కుటుంబంలో ఒక్కో విద్యార్ధికి అందచేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, పాఠశాలల్లో 75 శాతం హాజరు తప్పని సరి చేసారు.

51 వేల మంది ఈ సారి డ్రాప్
ఈ సారి అమ్మ ఒడి పథకం నుంచి గతంలో లబ్ది పొందిన వారిలో 51 వేల మందికి అర్హత లభించలేదని ..వారిని ఈ రోజు విడుదల చేసే పథకంలో నగదు అందదని విద్యా శాఖ స్పష్టం చేసింది. గత సెప్టెంబర్ నుంచి విద్యాసంస్ధలు యధావిధిగా పని చేస్తున్నందున 75 శాతం హాజరు నిబంధన అమలు కానుంది. 75 శాతం హాజరు లేని కారణంగానే వారికి ఈ సారి అమ్మఒడి నుంచి తప్పించినట్లు స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఈ పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు రెగ్యులర్ గా పంపాలని సూచించింది. డ్రాపవుట్లను తగ్గించేందుకే 75 హాజరు నిబంధన పెట్టామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొత్తంగా రూ 19,618 కోట్ల లబ్ది
2019-20లో తొలి ఏడాది కావటంతో మినహాయింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. 2020-21 కాలంలో కరోనా కారణంగా మినహాయింపు ఇచ్చామని చెప్పుకొచ్చింది. ఈ సారి 15 వేల చొప్పున ఇచ్చే నగదులో పాఠశాల..మరుగుడదొడ్ల నిర్వహణకు రెండు వేలు చొప్పున మినహాయించనున్నారు. ఇంటర్మీడియట్ వరకు చదవుకొనే పిల్లలు ఉన్న తల్లులు ఈ పథకంలో లబ్ది దారులుగా ఉన్నారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్ శ్రీకాకుళం చేరుకొని ..అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్నాహ్నం 2.30 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications