ఎన్నికల వేళ కీలక ఘట్టం పూర్తి చేసిన జగన్ - కలిసొచ్చేనా..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ హామీల అమలు దాదాపు పూర్తి చేసారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో పై కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేసారంటూ మండిపడ్డారు.
నిధులు విడుదల : అనకాపల్లి వేదికగా సీఎం జగన్ వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు విడుదల చేసారు. 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు గానూ రూ.5,060.49 కోట్ల సాయాన్ని విడుదల చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ.18,750 చొప్పున నగదు జమ చేసారు. ఈ సమయంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది..మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శ చేసారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తారని దుయ్యబట్టారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తారంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. అమ్మవారి పేరుతో మహాలక్ష్మి పథకం పేరుగా ప్రకటించి అమలు చేయకుండా మోసం చేసారని వ్యాఖ్యానించారు.

అమలు చేసిన హామీలు : వైఎస్సార్ చేయూత పథకంతో అందించిన మొత్తం రూ.19,189.60 కోట్లుగా జగన్ వెల్లడించారు. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వంగా పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదన్నారు. 99.83 శాతం రుణ రికవరీతో మన పొదుపు సంఘాలు దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందన్నారు. 31 లక్షల ఇంటి స్థలాలు అందించిన ప్రభుత్వంగా చెప్పారు. గత ప్రభుత్వం రైతులు, మహిళలు, అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు నుంచి చేయూత నిధుల విడుదల కార్యక్రమం 14 రోజులు కొనసాగుతుందని చెప్పారు.

ఎన్నికల్లో కలిసొచ్చేనా : వచ్చే రోజుల్లో చంద్రబాబు, పవన్ మరిన్ని అబద్దాలతో ప్రజల ముందుకు వస్తారని జగన్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేశామని జగన్ వివరించారు. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నామని జగన్ చెప్పారు. ఈ నిధుల విడుదల ద్వారా సంక్షేమం..నవరత్నాల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాల అమలు దాదాపుగా పూర్తయినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఈ నెల 10న అద్దంకి వేదికగా జరిగే సిద్దం సభలో సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల పైన ప్రకటన చేయనున్నారు. దీంతో..జగన్ నమ్ముకున్న సంక్షేమ ఓట్ బ్యాంక్ ఏ మేర ఓట్లుగా మళ్లుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications