ఆ మాట ఎక్కడా వినిపించడానికి వీల్లేదు?
మద్దతు ధరకన్నా తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకున్నారు.. అనే మాట వినపడటానికి వీల్లేదని, తనకు వినపడితే మాత్రం ఊరుకోనని ముఖ్యమంత్రి జగన్ అధికారులను హెచ్చరించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.
రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడమనేది అధికారులంతా సవాల్ గా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సేకరించే ధాన్యం వల్ల రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందాలన్నారు. ఇ-క్రాపింగ్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ ఉండాలని సూచించారు. వ్యవసాయశాఖతో పౌర సరఫరాలశాఖ అనుసంధానం కావాలని, దీనివల్ల రైతులకు మంచి జరుగుతుందన్నారు. ఎరువులు, విత్తనాలతోపాటు రైతుకు రబీ సీజన్ కు కావల్సినవన్నీ సిద్ధం చేయాలన్నారు. ఈనెల 29వ తేదీన సున్నా వడ్డీ పంట రుణాలతోపాటు ఇన్ ఫుట్ రాయితీ కూడా జమచేయాలన్నారు. ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ను ఉంచాలని, వచ్చే రెండు సంవత్సరాల్లో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్లు ఉండాలన్నారు.

రాష్ట్రంలో ఈ కేవైసీ చేయించుకోవాల్సిన రైతులు ఈనెల 12వ తేదీలోగా చేయించుకోవాలి. పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత పొందాలంటే ఈ-కేవైసీ చేయించుకోవడం ప్రధానం. సామాజిక తనిఖీల కోసం ఈకేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈనెల 16 నుంచి ప్రదర్శిస్తారు. రైతు భరోసా కేంద్రాల్లో జాబితా ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పివరకు ఖరీఫ్ సీజన్ లో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రైతులు తమ మొబైల్ నెంబరుకు సాగుచేసి పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications