ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష.. ఫీజుల నియంత్రణ , ప్రమాణాలకు పెద్ద పీట
ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినా సీఎం జగన్ మాత్రం సమీక్షలు ఆపటం లేదు. అన్ని శాఖల్లోనూ అధికారుల పనితీరు , వివిధ పథకాలు అమలవుతున్న విధానంపై సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక నేడు ఉన్నత విద్యపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు.
ఉన్నతవిద్యపై అధికారులతో చర్చించిన సీఎం జగన్
అధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలేజీల ఫీజుల ప్రతిపాదనలను ఏపీ హయ్యార్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఎం జగన్ ముందు పెట్టింది . ప్రైవేట్ కళాశాలలలో ఫీజులపై నియంత్రణ అవసరం అని భావిస్తున్న నేపధ్యంలోనే ఏపీ సర్కార్ ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుంది.
ప్రమాణాలు పాటించని కాలేజీలపై ఉక్కుపాదం
ఇక ఈ నేపధ్యంలో ప్రైవేట్ కళాశాలల దోపిడీకి పూర్తిగా చెక్ పెట్టాలని భావించిన సీఎం జగన్ మనం రూపొందించుకునే విధానాలు దీర్ఘకాలం అమలు కావాలని అధికారులతో పేర్కొన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫీజు రియింబర్స్మెంట్ చెల్లింపునకు తాము ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.
స్థిరమైన ఫీజు విధానం కళాశాలల్లో ఉండాలన్న సీఎం వైఎస్ జగన్
గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి, ప్రభుత్వం తరపున చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు . మార్చి 30లోగా చెల్లింపులు చేసేందుకు ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు వల్ల కళాశాలలకు మంచి జరుగుతుందన్నారు. ఇక కళాశాలలు సైతం నిబంధనలను కచ్చితంగా అమలు చెయ్యాలని పేర్కొన్నారు. స్థిరమైన ఫీజు విధానం కళాశాలల్లో ఉండాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ సమావేశంలో ఫీజుల నియంత్రణతో పాటు విద్యా ప్రమాణాలకు పెద్ద పీట వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.