టాలీవుడ్ పెద్దల ఇగో పై జగన్ మార్క్ దెబ్బ: లైట్ తీసుకున్నందుకేనా-అమరావతికి పరుగులు..!!
టాలీవుడ్ పెద్దలకు బిగ్ షాక్. నిర్మాతలు-డిస్ట్రిబ్యూషన్- ఎగ్జిబిటర్స్-మల్లీప్టెక్స్ లు ఇలా..అన్నింటా టాలీవుడ్ లో కొందరిదే ఆధిపత్యం. ఇప్పుడు వారందరికీ ఏపీ సీఎం జగన్ ఊహించని జలక్ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ మార్కెట్ కు ఏపీ కీలకం. రాష్ట్ర విభజనకు ముందు..తరువాత కూడా ఆంధ్రా-సీడెడ్ ప్రాంతంలోనూ వ్యాపారం ఎక్కువ. హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన టాలీవుడ్ ఏపీ పైన ఫోకస్ పెట్టలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పదే పదే కలిసిన సినీ ప్రముఖులు జగన్ సీఎం అయిన తరువాత కలవాటానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు.
జగన్ ను లైట్ తీసుకున్నారా
ఇది ఓపెన్ గా జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రులు మారిన ప్రతీ సారి తాము బొకేలు తీసుకొని వారి వద్దకు పరిగెత్తాలా అంటూ ఒక టాలీవుడ్ సీనియర్ హీరో వేసిన ప్రశ్న వైసీపీ కేడర్ కు రుచించ లేదు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి పలు కీలక రంగాల్లో జగన్ వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చిరంజీవి అండ్ కో మినహా ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకొనే ఇతర ప్రముఖులు సీఎంను కలిసిన సందర్భాలు లేవు.
ఏపీపైన ఎందుకు ఆసక్తి చూపరు
సినీ పరిశ్రమకు ఏపీలో విస్తరించేందుకు మందుకు వచ్చిన అంశాలు లేవు. చిరంజీవితో కలిసి వచ్చిన నిర్మాతలను సీఎం జగన్ స్వయంగా విశాఖలో సినీ పరిశ్రమ విస్తరణకు ముందుకు రావాలని ఆహ్వానించారు. కానీ, ఏపీలో పరిశ్రమ విస్తరణ దిశగా ఒక్క ప్రకటన...ప్రతిపాదన ఇప్పటి నుంచి సినీ ప్రముఖుల నుంచి రాలేదు. ఇక, ప్రముఖ హీరోల సినిమాల పేరుతో విడుదలైన సమయంలో అదనపు షో లు...పెంచుతున్న టిక్కెట్ల ధరలతో నిర్మాతలకు మేలు జరుగుతోంది. ప్రేక్షకుడికి ఏంటి ఉపయోగం అనేది ఏపీ ప్రభుత్వంలో చర్చ మొదలైంది.
ఏపీ ప్రేక్షకులు కావాలి... పరిశ్రమ విస్తరించరా
అంతే... పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచే ప్రభుత్వం తన పంధా మార్చింది. గతంలో జరిగిన విధంగా జరగదని తేల్చి చెప్పింది. ప్రముఖ హీరోల పేరుతో సామాన్య అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో టిక్కెట్లకు వసూలు చేయటాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. ఎంత ఒత్తిడి వచ్చినా ససేమిరా అంది. అదే సమయంలో మరో కీలకం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు జిల్లా జేసీల చేతిలో ఉండే అదనపు షో లు..టిక్కెట్ల ధరల నిర్ణయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ధరలు పెంచటానికి అవకాశం లేకుండా ఆదేశాలిచ్చారు.
అంతా వారి చేతుల్లోనే ఉంటే ఎలా..
ఇక, వెబ్ సైట్స్.. యాప్ ల పేరుతో విక్రయిస్తున్న సినిమా టిక్కెట్ల విషయంలోనూ ఏదో గోల్ మాల్ ఉందనేది ప్రభుత్వ అనుమానం. ఇక, నిర్మాతల మొదలు...మల్టీ ప్లెక్స్ ల వరకూ ఒకే వర్గం వారికి ఎక్కువగా ఏపీలో కనిపిస్తాయనే వాదన ఉంది. సినీ ఇండస్ట్రీలో ఈ వర్గాల గురించి బయటకు చెప్పేందుకు ఇష్టపడకున్నా..అంతర్గతంగా మాత్రం ఇదే అసలు చర్చ. సినిమా నిర్మించటం...ఏపీ మార్కెట్ లో వరే ప్రేక్షకులను సొమ్ము చేసుకోవటం..కానీ, ఏపీ కోసం ఏదీ చేయకుండా ఉండిపోవటం జగన్ అండ్ టీంకు నచ్చటం లేదనే వాదన ఉంది.
జగన్ నిర్ణయం వెనుక భారీ కసరత్తు
అంతే, సడన్ గా ప్రభుత్వ పరిధిలోని ఎఫ్ డీసీ నుంచే ఒక వెబ్ సైట్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఏ,బీ,సీ సెంటర్లలోని అన్ని ధియేటర్లు..అన్ని ప్రాంతాల్లోనూ టిక్కెట్ల ధరలు ఈ వెబ్ సైట్ ద్వారానే విక్రయాలు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాల రూప కల్పన కోసం ఒక కమిటీ వేసారు. అందులో సినీ పరిశ్రమ నుంచి ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీ పెద్దలకు అర్దం అయ్యేలోగానే తమ పని మొదలు పెట్టేసింది. మొత్తం ప్రభుత్వమే వసూలు చేసి..నిర్వహణా ఛార్జీలు మినహాయించి..ఎవరికి ఎంత ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటంది.
ప్రభుత్వం చేతి నుంచే వారికి పంపిణీ
ఇక్కడే..అసలు సమస్య నిర్మాతలు-ఎగ్జిబిటర్లు..ధియేటర్ల యాజమన్యాలకు సమస్య మొదలవుతుంది. ఇదంతా ప్రభుత్వం చేతిలోకి వెళ్తే..అసలు తమకు దక్కేది ఎంత అనేది వారికి అర్దం కాని విషయంగా మారుతోంది. దీంతో..జగన్ నిర్ణయం అర్దం కాక..అసలు లోగుట్టు తెలియక టాలీవుడ్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సీఎం జగన్ వద్దకు ఇప్పుడు పెద్ద మనుషలుగా చెప్పుకుంటున్న వారు ఇక వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ మార్కెట్ ను వదులుకోలేరు. కరోనా దెబ్బ నుంచే కోలుకో లేదు.
జగన్ మార్క్ దెబ్బ తట్టుకోవాలంటే..చిరంజీవితో కలిసి..
ఇక, జగన్ దెబ్బను ఎలా తట్టుకోవాలనే టెన్షన్ మొదలైంది. ఇక, మిగిలింది ఒకటే ఆప్షన్. సీఎం జగన్ తో కొంత మంచి రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తున్న చిరంజీవికి నాయకత్వం అప్పగించటం. ఆయన నాయకత్వంలో సీఎంను కలిసేందుకు అమరావతికి వెళ్లటం. తమ నుంచి స్పష్టమైన హామీలు ఇచ్చి..జగన్ ను ప్రసన్నం చేసుకోవటం. ఏదో ఒకటి చేసి ఆ నిర్ణయం అమలు కాకుండా చూసుకోవం. ఇదీ..ఇప్పుడు టాలీవుడ్ పెద్దల ముందున్న అసలు టాస్క్. దీంతో..అసలు తమకు అమరావతితో ఏం పని ఉందిలే అనుకొనే టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు జగన్ మార్క్ డెసిషన్ తో అమరావతికి పరుగులు తీయక తప్పేలా లేదు. ఆ తరువాతనే పరిష్కారం లభిస్తుందేమో చూడాలి.