మరోసారి రంగంలోకి పీకే టీమ్- కొత్త టాస్క్ అప్పగించిన జగన్- సక్సెస్ అయితే తిరుగులేదిక..
2019 ఎన్నికల్లో ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండానే వైసీపీకి భారీ విజయాన్ని అందించడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ టీమ్ ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తుందని భావించినా పలు కారణాలతో అది సాధ్యం కాలేదు. కానీ ఆయన టీమ్ సభ్యులు ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలక అంశంలో సహకారం అందించేదుకు ముందుకొస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ప్రజలకు అందించే సేవల విషయంలో మరో గొప్ప ముందడుగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం ముందుగా ఓ సర్వే నిర్వహించేందుకు వారికి బాధ్యతలు అప్పగించారు.

ఐప్యాక్ అందించిన విజయం...
గతంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీమ్ ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసింది. పక్కా కార్పోరేట్ వ్యూహాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్ధితులను ఔపోసన పట్టడమే కాకుండా విజయం కోసం ఏం కావాలో అది తూచా తప్పకుండా అమలు చేసి చూపించింది. అప్పట్లో ఐప్యాక్ తమకు అందించిన విజయాన్ని సీఎం జగన్ ఎప్పటికీ మర్చిపోలేరు. దీంతో ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని జగన్ కోరినా ప్రశాంత్ కిషోర్ అప్పట్లో సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత అప్పటి ఐప్యాక్ టీమ్ సభ్యులు ఏపీలో వైసీపీ, టీడీపీ తరఫున పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అది వివిధ రూపాల్లో సాగుతోంది.

మరోసారి రంగంలోకి పీకే టీమ్...
అప్పట్లో వైసీపీ గెలుపుకోసం ఐప్యాక్ లో ఉండి శ్రమించిన వారంతా సీఎం జగన్ కు సుపరిచితులే. దీంతో ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సేవలను ఎలా వాడుకోవాలా అని ఆలోచించిన జగన్.. వీరికి మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో ఘనవిజయం అందుకున్న తర్వాత ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అంచనాలను అందుకోవడం ఒక్కోసారి జగన్ కే సాధ్యం కావడం లేదు. దీంతో ఐప్యాక్ టీమ్ లో పనిచేసిన కొందరు పీకే కార్పోరేట్ సొల్యూషన్స్ పేరుతో నెలకొల్పిన మరో సంస్ధను ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందులో మొదటి అడుగుగా వీరితో వాలంటీర్ల వ్యవస్ధపై సర్వే చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన హోంవర్క్న్ ను పీకే టీమ్ పూర్తి చేసింది.

వాలంటీర్ల వ్యవస్ధపై సర్వే...
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన జన్మభూమి కమిటీలు ప్రపంచంలో ఏ ప్రభుత్వానికీ తీసుకురానంత చెడ్డపేరును సీఎం చంద్రబాబుకు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా 2019 ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల తరహాలోనే తెరపైకి వచ్చిన వాలంటీర్ల వ్యవస్ధకు అలాంటి చెడ్డపేరు రాకుండా చూడాలని భావిస్తోంది. ఈ పని ఎంత నిష్కర్షగా చేయగలిగితే 2024 ఎన్నికల్లో తమకు అంతగా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. దీంతో ముందుగా ఏడాదిలో రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుపై ఓ సమగ్ర సర్వే చేయించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే వాలంటీర్లపై వస్తున్న ఫిర్యాదులు, టీడీపీ ఈ వ్యవస్ధపై చేస్తున్న ఆరోపణలు, అక్కడక్కడా నమోదవుతున్న కేసులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సర్వే తర్వాత అసలు పని....
ఓసారి గ్రామ, వార్డు వాలంటీర్ల పనితీరుపై ప్రభుత్వానికి సమగ్రంగా సర్వే వివరాలు అందితే ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పుడు అదే పీకే టీమ్ ను వాలంటీర్ల వ్యవస్ధ సమన్వయం చేయడంతో పాటు వాటి పనితీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడం.. అంతిమంగా ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. సర్వే పూర్తయ్యాక వీటి ఫలితాల ఆధారంగా పీకే టీమ్ కు ఇవ్వాల్సిన బాధ్యతలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అప్పుడు వాలంటీర్ల వ్యవస్ధ మెరుగ్గా సేవలందించేందుకు థర్డ్ పార్టీ పేరుతో పీకే టీమ్ రంగంలోకి దిగి సమన్వయం చేస్తుంది. 2024 ఎన్నికల నాటికి వాలంటీర్ల వ్యవస్ధను ప్రజలకు పూర్తి స్ధాయిలో చేరువ చేసి ఇక జనానికి ప్రభుత్వ సేవలు అందించడంలో గ్యాప్ పూర్తిగా తొలగించాలనేది జగన్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications