రాజధాని అమరావతి నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష .. ప్రణాళిక సిద్ధం చెయ్యాలని ఆదేశం
ఏపీలో రాజధానులపై రగడ కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోని నిర్మాణాలపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దీంతో అమరావతి విషయంలో సీఎం జగన్ ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది.

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సీఎం సమీక్ష
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , సీఎస్ నీలం సాహ్ని, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులు, వాటిని పూర్తి చేసే కార్యాచరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు.

నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని ఆదేశం
అసంపూర్ణంగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని , సిఎస్ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టాలని, అందుకు కావలసిన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పూర్తికి సుమారుగా 14 వేల నుండి 15 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు . హ్యాపీ నెస్ట్ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

తాజా పరిణామాలతోనే అమరావతి నిర్మాణాలపై సమీక్ష
మరోపక్క రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 240 రోజుకు రాజధాని రైతుల నిరసనలు చేరుకున్నాయి. రాజధానిగా అమరావతిని మార్చవద్దని ఆందోళనలు కొనసాగిస్తున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానులు ఏర్పాటుపైనే దృష్టిపెట్టారు. అంతేకాదు అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పి, అమరావతిలో అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలపై దృష్టి సారించారు . ఏపీ హైకోర్టు అమరావతిలోని నిర్మాణాల విషయంలో ప్రభుత్వాన్ని వివరాలు అడుగుతున్న నేపథ్యంలో తాజాగా అమరావతి నిర్మాణాలపై సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది .
Recommended Video

ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించిన నేపధ్యంలోనే నిర్ణయమా!!
అమరావతిలో నిర్మాణాల విషయంలో హైకోర్టు ప్రభుత్వాన్నిలెక్కలు అడిగింది. రాజధాని అమరావతి లోని భవనాల నిర్మాణానికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి? 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయి? ఖర్చుల వివరాలు అన్ని తమకు సమర్పించాలని ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి శిథిలావస్థకు చేరుకుంటాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారు అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో అసంపూర్ణంగా నిర్మాణం జరిగిన అమరావతి భవనాలను పూర్తిచేయాలని , వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని నేడు నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు సీఎం జగన్.












Click it and Unblock the Notifications