నిషేధిత భూముల వ్యవహారాలకు (22 ఎ) చెక్పెట్టాల్సిందే - లక్ష్యంలోగా సర్వేను పూర్తిచేయాలి : సీఎం జగన్..!!
నిషేధిత భూముల వ్యవహారాలకు (22 ఎ) చెక్పెట్టాలని..ఆ జాబితాలో పెట్టాలన్నా, తొలగించాలన్నా సరైన విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వేను పూర్తిచేయాలి అధికారులకు నిర్దేశించారు. భూ క్రయ విక్రయాలు జరిగినప్పుడే రికార్డులు కూడా అప్డేట్ చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు సంబంధించిన ప్రక్రియలు చేపట్టాలని స్పష్టం చేసారు. సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం నిర్దేశించారు.

ల్యాండ్ రికార్డుల అప్డేషన్ జరగాలి
ప్రతి ఏటా ఒక వారంలో ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి అయిందని..డిసెంబర్ 2021 నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎం కు వివరించారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్న అధికారులు..జూన్ 22, 2022 నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని..మరో 2400 గ్రామాల్లో ఆగస్టు 2022 నాటికి పూర్తి అవుతుందని వెల్లడించారు.

అప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వే చేశామన్న అధికారులు..సర్వే పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి రికార్డుల్లోనూ, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్డేట్ కావాలని సూచించిన సీఎం..అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలని స్పష్టం చేసారు.

నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి
దీనిపై ప్రత్యేక టీంను పెట్టి.. తగిన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. ల్యాండు రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారిని ఈ టీంలో పెట్టాలని సూచించారు. ల్యాండ్ రికార్డుల అప్డేషన్ను ప్రతి ఏటా ఒక వారంలో చేపట్టాలని..దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ల్యాండు రికార్డుల అప్డేషన్, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసారు. మనం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కడా అవినీతికి చోటులేని విధంగా, రైతులకు, భూ యజమానులకు మేలు చేసేలా ఉండాలని తేల్చి చెప్పారు.
Recommended Video

సమర్ధవంతమైన మార్గదర్శకాలతో ముందుకెళ్లాలి
సమర్థవంతమైన మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 22ఎ కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం చెప్పుకొచ్చారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, ఆ జాబితాలో పెట్టాలన్నా అనుసరించాల్సిన విధానాన్ని లోపాలు లేకుండా తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications