టీడీపీ బిగ్ మిస్టేక్, ఢిల్లీ లాక్ - జగన్ లెక్క వెరీ క్లియర్..!!
45 ఇయర్స్ ఇండస్ట్రీ లెక్క తప్పింది. జగన్ ను తక్కువ అంచనా వేసారు. ఉచ్చులో చిక్కారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న టీడీపీ చంద్రబాబు గైర్హాజరీతో బలహీనత బయట పెట్టుకుంది. అటు బీజేపీతో పొత్తు లో ఉన్న పవన్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇక్కడే పవన్ తొందరపడ్డారు. అటు బీజేపీ ఏపీలో జరుగుతున్న రాజకీయం గమనిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెట్టారు. సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించారు.
టీడీపీ లెక్క తప్పింది
తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు ముందే సమాచారం ఉంది. ఆ మేరకు స్వయంగా ఆయనే ఈ విషయం బయట పెట్టారు. కానీ, అలర్ట్ కాలేదు. అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందనే అంచనాలు వేసుకున్నట్లు పార్టీలో ప్రచారం. కానీ, చంద్రబాబు చెప్పిన విధంగానే అరెస్ట్ అయ్యారు. కానీ, పార్టీ నేతలకు ఏం చేయాలో అర్దం కాలేదు. రిమాండ్ విధించటంతో రాజమండ్రి జైలుకు తరలించారు.

కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే మకాం వేసారు. పలు ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల పేరుతో నిరసనలు జరిగాయి. అందులో ఎక్కువగా ఒక వర్గం వారే ఉన్నారనే ప్రచారం పార్టీకి నష్టం చేసే అంశం. ఇదే వైసీపీకి మేలు చేసే అంశంగా విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు పై సానుభూతి వస్తుందనే టీడీపీ అంచనాలు బెయిల్ కోరకపోవటంతో సన్నిగిల్లుతున్నాయి.
పవన్ తొందరపడ్డారా
క్వాష్ కు ఇచ్చిన ప్రాధాన్యత బెయిల్ పైన ఆలోచన చేయలేదు. కేసు కొట్టివేస్తే తప్పు చేయని చంద్రబాబును రాజకీయ కక్ష్య లో భాగంగా జైలులో పెట్టారని చెప్పుకోవాలనేది టీడీపీ ప్రయత్నం. కానీ, ఈ ప్రయత్నంలో 36 రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. అటు పవన్ జైలులో చంద్రబాబును కలిసి వెంటనే బయటకు వచ్చి పొత్తు ప్రకటించారు.
అదేనా పొత్తు ప్రకటనకు సందర్భం అనే చర్చ జరిగింది. ఆ తరువాత పవన్ నిర్వహించిన యాత్రలకు ఆశించిన స్పందన లేదు. బీజేపీని కాదనలేక..టీడీపీని వదులుకోలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. అటు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో, బీజేపీతో కలిసి ఉండాలో..వద్దో తెలియని అనిశ్చితిలో టీడీపీ..పవన్ ఉండిపోయారు.

పై చేయి సాధించేలా
చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో టీడీపీ, పవన్ చేసిన మిస్టేక్స్ ప్రత్యక్షంగా..పరోక్షంగా జగన్ కు కలిసి వచ్చేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణ ఎన్నికలు వచ్చేసాయి. అక్కడ పార్టీ ఎన్నికల సమయంలో ఏం చేయాలో ఎవరూ నిర్ణయించలేని పరిస్థితి. ఇక, ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణ ఫిక్స్ చేసారు. ఈ సమయంలోనే జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. తన సంక్షేమ ఓట్ బ్యాంక్ ను మరింత పదును పెట్టారు.
చంద్రబాబు, లోకేశ్, పార్టీ నేతలను కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బీజేపీ మౌనం టీడీపీ, జనసేనను లాక్ చేసింది. ఏం జరిగినా.. ఏపీలో జగన్ ను ఓడిస్తేనే రాజకీయంగా భవిష్యత్ అని టీడీపీ, జనసేన డిసైడ్ అయిపోయాయి. అందుకే బీజేపీతోనూ సర్దుకుపోవటానికే ప్రయత్నిస్తున్నారు. కానీ, బీజేపీ నిర్ణయం ఏంటనేది క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఎన్నికల వేళ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే జగన్..తన ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications