మరో మాజీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ వేటు - హిట్ లిస్టులో ఇంకా..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారి పైన చర్యలు మొదలు పెట్టారు. హిట్ లిస్టులో ఉన్న వారిని ఒక్కొక్కరి పైన వరుసగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ నేత మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణ ను సీఎం జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన దోవారి ఏసు దాస్ (డీ వై దాస్)ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం ప్రకటించారు.
డీ వై దాస్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై వచ్చినట్లు వైసీపీ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి పార్టీ అధినేతకు నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం జగన్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా కైలే అనిల్ కుమార్ గెలుపొందారు. టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీ చేసారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే గెలిచింది. ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి గెలిచి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు.
ఇక, వచ్చే ఎన్నికల కోసం ఇక్కడ నుంచి టీడీపీ ఇప్పటికే అభ్యర్ధిని దాదాపుగా ఖరారు చేసింది. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా వర్ల రామయ్య తనయుడు కుమార్రాజా నియమితులయ్యారు. అయితే, అటు గడపగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులతో సహా ఎమ్మెల్యేలకు పని తీరు పైన టైం ఫిక్స్ చేసిన సీఎం జగన్..ఇటు నియోజకవర్గాల్లోని గ్రౌండ్ రియాల్టీ పైన ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్యమని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే వివాదాలు నెలకొన్న నియోజకవర్గాల పైన సీనియర్లకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి..వారి నివేదికలతో పాటుగా తాను సేకరిస్తున్న సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. మొన్న పొన్నూరు..ఇప్పుడు పామర్రు నియోజకవర్గాల పైన నిర్ణయాలు తీసుకున్నారు.
పరిస్థితుల్లో మార్పు రాకపోతే..సీనియర్లు ఉన్న కొన్ని కీలక నియోజకవర్గాల్లోనూ ఇటువంటి చర్యలే ఉంటాయని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం - నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతల తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకొనే దిశగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ మాసాంతానికి.. నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను పూర్తిగా దిద్దుబాటు చేసే విధంగా కార్యచరణ సిద్దమైంది. దీంతో..రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.