జస్టిస్ కనగరాజ్కు సీఎం జగన్ బంపరాఫర్ : పీసీఏ ఛైర్మెన్గా నియామకం: ఆ హోదాలో తొలి వ్యక్తిగా..!!
జస్టిస్ కనగరాజ్. ఈ పేరు గత ఏడాది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైన పేరు. కరోనా కల్లోలంలో కీలకమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అనూహ్యంగా నియమితులయ్యారు. అంతే అనూహ్యంగా ఆ పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ కనగరాజ్ కు తిరిగి కీలక పదవి అప్పగించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ నిర్వహించని ఆ పదవిలో కనగరాజ్ ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
నాటి వార్ లో బాధితుడుగా...
తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనగరాజ్ ను గత ఏడాది ఏపీ ప్రభుత్వం చట్ట సవరణతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తో ఏపీ ప్రభుత్వం మధ్య సాగిన వివాదంలో భాగంగా..రమేష్ ను తప్పించి కనగరాజ్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన నియామకం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టులో రిటైర్డ్ హైకోర్టు స్థాయి అధికారిని నియమించేలా పంచాయితీ రాజ్ చట్ట సవరణ చేసారు. దానికి ఆమోదం తెలుపుతూ... కరోనా సమయంలో ప్రత్యేకంగా చెన్నై నుండి రాజమార్గంలో వచ్చిన కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ నియామకం పైన..తనను తప్పించటం పైన నిమ్మగడ్డ రమేష్ కోర్టును ఆశ్రయించారు . దీంతో...విచారణ తరువాత కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ..తిరిగి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో..కనగరాజ్ ఆ పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది.
తిరిగి కీలక హోదాతో గౌరవం..
ఇక, పదవి దక్కినట్లే దక్కి కోల్పోయి..మొత్తం ఎపిసోడ్ లో బాధితుడిగా మిగిలిపోయిన కనగరాజ్ కు ఇప్పుడు కీలక పదవి దక్కింది. దీంతో..హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హోదాలో ఇవ్వగలిగే పోస్టు పైన ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్న పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ అథారిటీకి ఛైర్మన్ గా కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ అథారిటీ సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యింది. దీని ద్వారా పోలీసుల ద్వారా న్యాయం జరగకపోయినా..ఫిర్యాదుల విసయం లో అలసత్వం వహించినా..పట్టించుకోక పోయినా సాధారణ ప్రజలు ఈ అథారిటీని ఆశ్రయించవచ్చు.
Recommended Video
సముచిత స్థానంతో గుర్తింపు..
అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు పని చేస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ అథారిటీ పని చేస్తోంది. సుప్రీం సూచనల మేరకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఛైర్మన్ గా... రిటైర్డ్ ఐఏఎస్..రిటైర్డ్ ఐపీఎస్ తో పాటుగా ఎన్జీఓ సంస్థ నుండి ఒకరు సభ్యుడిగా ఉంటారు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు...సిఫార్సులు చేయటం ఈ కమటీ ప్రధాన బాధ్యత. దీంతో..గతంలో తాము పదవి ఇచ్చినా...కొనసాగలేని పరిస్థతులు ఏర్పడటంతో..తిరిగి కీలక పదవి ఇచ్చి తాము ఇచ్చే గౌరవం ఏంటనే నిరూపించుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన. దీంతో..జస్టిస్ కనగరాజ్ కు రాష్ట్రంలో తొలి సారిగా ఏర్పడుతున్న ఈ అధారిటీ ఛైర్మన్ పదవి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లా స్థాయిలోను కమిటీలు ఏర్పాటు చేయనుంది.