25న ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభం- జగన్ చేతుల మీదుగా- 28 నుంచి రాకపోకలు
ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ రాకపోకలకు సిద్ధమైంది. ఈ నెల 25న సీఎం జగన్, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి విమానాల రాకపోకలకు వీలు కలుగుతుంది.
దేశంలో విమానయానాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా భారీ ఎయిర్పోర్టుల నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎయిర్స్ట్రిప్లను అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లా ఓర్వకల్లులోనూ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడి నుంచి బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు పెంచేందుకు వీలుగా ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా ఈ ఎయిర్పోర్టుకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి దీన్ని నిర్మించింది. ఈ నెల 25న సీఎం జగన్ చేతుల మీదుగా ఎయిర్పోర్టు ప్రారంభం కానుంది. అయితే ఈ నెల 28 నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల టికెట్ బుక్కింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి రాకపోకలు పెరిగితే రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కూడా బాటలు పడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.