రేపు విశాఖకు సీఎం జగన్ - ఈ సారి పర్యటన ప్రత్యేకంగా..!!
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. శారదా పీఠంలో జరిగే కార్యక్రమంతో పాటుగా పార్టీ ఎంపీల నివాసాల్లో శుభకార్యాలకు హాజరవుతారు.
ముఖ్యమంత్రి జగన్ రేపు (శనివారం) విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ నుంచి పాలన ప్రారంభానికి ముహూర్తం ఖరారు వేళ సీఎం జగన్ వైజాగ్ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ లో పలు కార్యక్రమాల్లో హాజరు కానున్నారు. శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తరువాత విశాఖ - అనకాపల్లి ఎంపీల నివాసాల్లో జరిగే వివాహ వేడకల్లో హాజరు కానున్నారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా పాలన పైన మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ విశాఖ పర్యటన వస్తున్న వేళ..ఏమైనా సంకేతాలు ఇస్తారా అనే ఆసక్తి కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ శనివారం ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరుతారు. విశాఖ ఏయిర్ పోర్టు నుంచి నేరుగా చినముషిడివాడలో ఉన్న శారదాపీఠానికి చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. శారదా పీఠంలో ప్రతీ ఏటా జరిగే వార్షికోత్సవంలో సీఎం పాల్గొంటున్నారు. ఈ సారి కూడా పీఠంలో జరిగే రాజ శ్యామల యాగంకు హాజరవుతారు. ఆ తరువాత అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్కు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి కుయారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి దంపతులను సీఎం ఆశీర్వదించనున్నారు.
ఆ వెంటనే విశాఖ ఎంపీ సత్యనారాయణ నివాసానికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. ఎంపీ కుమారుడుశరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి సీఎం జగన్ వారిని ఆశీర్వదించనున్నారు. ఆ తరువాత ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదించిన తరువాత ముఖ్యమంత్రి తాడేపల్లికి బయల్దేరనున్నారు. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెల 31న ఈ కేసు సుప్రీంలో విచారణకు రానుంది. ఇదే సమయంలో కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేసే అవకాశం ఉండటంతో ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..విశాఖ నుంచి పాలనకు సంబంధించి సీఎం ఈ పర్యటనలో సంకేతాలు ఏమైనా ఇస్తారా అనే ఆసక్తి మొదలైంది.