ప్రధాని సమక్షంలో సీఎం జగన్ కీలక ప్రతిపాదన - వాట్ నెక్స్ట్..!!
ప్రధాని మోదీ విశాఖలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సీఎం జగన్.. గవర్నర్ బిశ్వభూషణ్ తో కలిసి ప్రధాని మోదీ ఏయూ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు రూ. 3,500 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతోపాటు సుమారు రూ.7,6000 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన శాఖల కేంద్ర మంత్రులు..అధికారులు పాల్గొంటున్నారు. ఇక, బహిరంగ సభ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.
ప్రధాని సమక్షంలో సీఎం ప్రతిపాదన
భారీ సంఖ్యలో జన సమీకరణకు నిర్ణయించింది. ప్రధాని మోదీ విశాఖ చేరుకున్న తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. రాజకీయంగా దిశా నిర్దేశం చేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీకి సంబంధించి పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ పరిణామాల పైన చర్చించనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ.. గవర్నర్.. సీఎం జగన్ ఏయూలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో సీఎం జగన్ విశాఖ వేదికగా ఏం కోరబోతున్నారు..ఎటువంటి ప్రతిపాదనలు ప్రధాని ముందు ఉంచబోతున్నారనేది ఆసక్తి పెంచుతోంది.

ప్రధాని సానుకూలంగా స్పందిస్తారా
విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ విశాఖ సభా వేదికగా ప్రధాని సమక్షంలోనే దీని పైన తమ ఉద్దేశం మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీలోని పరిస్థితులను వివరిస్తూనే ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో కొంత కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పైన జరుగుతున్న ఆందోళన గురించి ప్రధానికి సీఎం వివరించే అవకాశం ఉంది. దీనిని ఉప సంహరించుకోవాలని సభా వేదికగా కోరే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీకి ప్రధాని వరాలు ప్రకటిస్తారా
దీంతో..అటు అమరావతికి మద్దతుగా బీజేపీ నేతలు నిలుస్తున్న సమయంలో ప్రధాని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదనల పైన స్పందిస్తారా లేక దాటవేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీంతో పాటుగా స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని ఏమైనా స్పష్టత ఇస్తారా.. నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే ఆశలు స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో మొదలయ్యాయి. ఇక, ఏపీకి సంబంధించి ప్రధాని ముందు సీఎం జగన్ ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు.. ప్రధాని సభా వేదికగా ఏం ప్రకటించబోతున్నారనేది ఇప్పుడు పాలనా పరంగా అదే విధంగా రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications