సొంత ఇలాకాలో సీఎం జగన్ - ఆ నిర్ణయం తరువాత తొలిసారి : కర్నూలులో నేతలతో..!!
ముఖ్యమంత్రి జగన్ తన సొంత జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి.. ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరవుతారు. పట్టు వస్త్రాలను సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈనెల 15న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది.
ఒంటిమిట్ట కళ్యాణోత్సవంలో
స్వామివారి కల్యాణం కోసం 100 కిలోల ముత్యాల తలంబ్రాలను ఇప్పటికే తిరుమల తిరుపది దేవస్థానం సమకూర్చింది. పండు వెన్నెల్లో రాముల వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణోత్సవం తరువాత అదేరోజు రాత్రి కడప నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు ఆర్ అండ్బీ గెస్ట్హౌస్ సమీపంలో గల ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే రహదారులకు ఇరువైపులా యుద్ధ ప్రాతిపదికన సుందరీకరణ పనులు చేపట్టారు.మరుసటి రోజు ఉదయం మేయర్ సురేశ్బాబు గృహానికి వెళ్లి ఆయన కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించనున్నారు.
రాత్రికి కడపలోనే బస..నేతలతో భేటీ
అనంతరం ముఖ్యమంత్రి కర్నూలు ప్రయాణమవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటు..మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం జగన్ తొలి సారి కడపకు రానున్నారు. అదే విధంగా ఈ రెండు జిల్లాల నుంచి పాతవారినే సీఎం తన కేబినెట్ లో మంత్రులుగా కొనసాగించారు. కర్నూలు నుంచి కొంతమంది ఆశావాహులు మంత్రి పదవుల కోసం చివరి నిమిషం వరకు ఆశతో నిరీక్షించారు.
ఇక,కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ నేతలు సీఎంను కలవనున్నారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు సీఎంను కలిసే అవకాశం ఉంది. వారికి సీఎం ఎటువంటి హామీ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోది. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా..కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
కర్నూలు పర్యటన..కేబినెట్ విస్తరణ తరువాత
అనంతరం ఒక అధికారి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. గతం కంటే వైభవంగా ఈ సారి ఒంటిమిట్ట లో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులతో పాటు ప్రముఖులు కల్యాణాన్ని తిలకించేందుకు ఆలయానికి దక్షిణ వైపున 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పటికే స్వాగత తోరణాలు, బారికేడ్లు, ఆర్చీల నిర్మాణం పూర్తైంది. కల్యాణానికి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని భావిస్తున్న అధికారులు....వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.