గవర్నర్ కు జగన్ పరామర్శ- కోవిడ్ నుంచి కోలుకోవడంతో- విశ్రాంతి తీసుకోమని సూచన
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను పరామర్శించారు. విజయవాడలోని రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులు.. గవర్నర్ దంపతులతో భేటీ అయ్యారు తాజాగా కోవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యంతో సతమతం అయిన గవర్నర్ ఆరోగ్యాన్ని జగన్ దంపతులు అడిగి తెలుసుకున్నారు.
సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన జగన్ దంపతులు... మర్యాదల తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గవర్నర్.. హైదరాబాద్లో చికిత్స అనంతరం విజయవాడకు చేరకున్నారు. ఓసారి కోవిడ్ బారిన పడి ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన గవర్నర్... ఆ తర్వాత కోలుకుని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మరోసారి అస్వస్ధతకు గురి కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో మరోసారి చికిత్స తీసుకుని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గవర్నర్ దంపతులను కలిసి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ గవర్నర్కు సూచించారు.
గతంలో పలుమార్లు వివిధ కీలక విషయాలపై చర్చించేందుకు గవర్నర్ తో భేటీ అయ్యే జగన్ తొలిసారి అనారోగ్యం బారిన పడిన గవర్నర్ ను, ఆయన సతీమణిని పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా తాజా పరిస్ధితులపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్ధితితో పాటు మరికొన్ని అంశాలపై చర్చించిన తర్వాత జగన్ దంపతులు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి వెళ్లిపోయారు. సీఎం జగన్ దంపతుల రాక సందర్భంగా రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు అరగంటకు పైగా జగన్ దంపతులు, గవర్నర్ దంపతులతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.