రైతుల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం...? యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఇప్పటికే రైతు భరోసా,సున్నా వడ్డీకే పంట రుణాలు,ఉచిత పంట భీమా వంటి పథకాలతో రైతాంగానికి మేలు చేసిన జగన్ ఇప్పుడు వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో ప్రతీ జిల్లాలో రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలుపై మంగళవారం(జనవరి 2) అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం జగన్ ఈ ప్రతిపాదన చేశారు.
యాక్షన్ ప్లాన్ సిద్దం చేయమన్న సీఎం
ప్రతీ జిల్లాలో రైతు భరోసా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం జగన్ అధికారులతో తెలిపారు. కల్తీ విత్తనాలతో జరిగే మోసాలు,పంట ఉత్పత్తుల విక్రయంలో దళారుల నుంచి ఎదురయ్యే మోసాలను నిలువరించడం ఇతరత్రా వ్యవహారాల్లో వారికి రక్షణగా నిలబడేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతీ పోలీస్ స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసి త్వరలోనే కార్యాచరణతో ముందుకు రావాలని అధికారులను ఆదేశించారు.
దిశ చట్టం అమలు తీరు...
దిశ చట్టం అమలుపై సమీక్ష సందర్భంగా మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను పోలీసులు అధికారులకు వివరించారు. 2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో మహిళలపై నేరాలు 7.5 శాతం మేర తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్) వాహనంపై ప్రధాని ప్రశంసలు కురిపించారని చెప్పారు. దిశ చట్టం కింద 471 కేసుల్లో 7 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. మరో 1080 కేసుల్లో 15 రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశామని, అందులో 103 కేసుల్లో శిక్షలు కూడా ఖరారు చేశామని వివరించారు.
యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు..
సైబర్ వేధింపులకు సంబంధించి 1531 కేసులు నమోదు చేశామని,లైంగిక వేధింపులకు సంబంధించి 823 కేసులు నమోదు చేశామని సీఎం జగన్కు అధికారులు వివరించారు. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడిన 1,40,415 మందితో డేటాను సిద్దం చేసినట్లు చెప్పారు. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు.తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ చట్టానికి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టాలని ఆదేశించారు.