రోల్ మోడల్ గా ఏపీ - కేంద్రం ప్రత్యేక గుర్తింపు: జగన్ మార్క్ నిర్ణయాలతో..!!
గృహ నిర్మాణంలో ఏపీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కో ఇంటికి రూ 5 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం లక్షా 30 వేల కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టారు. రాష్ట్రంలోని 31 లక్షల మంది మహిళలు సొంత ఇళ్లకు ఓనర్లుగా మారుతున్నారు. గృహ నిర్మాణ కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుర్తింపు దక్కింది.
కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సాంకేతికత జోడించి నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ పధకంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 4.95 కోట్ల మంది ప్రజల్లో దాదాపుగా 1.24 కోట్ల మందికి సొంతిటిలో ఉండే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రతీ జిల్లాలో జేసీని నియమించారు.

రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలం
ఇళ్ల పట్టాలు అందించే సమయంలో ప్రభుత్వం లబ్ది దారులకు మూడు ప్రత్యామ్నాయాలు కల్పించింది. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ జరిగింది. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ విశాఖ పరిధిలో లబ్దిదారులకు అందించారు. విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. డిసెంబర్ లో 8 వేల ఇళ్లు పంపిణీ చేయనున్నారు.
వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో
మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందించేలా కార్యాచరణ సిద్దం చేసారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అందిస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కొనసాగిస్తోంది. అన్ని వసతులు ఉన్న పట్టణాల్లోని కాలనీల్లో 435.56 చదరపు అడుగుల స్థలంలో, గ్రామాల్లో 653.34 చదరపు అడుగుల స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఇంటి నిర్మాణాలను ఉత్తమ జీవన ప్రమాణాలతో నిర్మించేలా డిజైన్ చేసారు. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు.

కాలనీలు కాదు..పట్టణాలుగా రూపాంతరం
అందులో ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్లు, సింటెక్స్ ట్యాంక్ లబ్ది దారులకు అందిస్తారు. జగనన్న కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవుతున్నాయి. వచ్చే ఉగాది నాటికి ఈ కాలనీలు దాదాపుగా లబ్ది దారులకు అందించేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications