భగీరథ్ అరెస్ట్ వెనుక అసలు విషయం బయట పెట్టిన సీఎం రేవంత్..!!
బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు నిబంధనల ప్రకారం, పద్ధతిగా దర్యాప్తు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భగీరథ్ లొంగిపోలేదని, పోలీసులు అతడిని అరెస్టు చేశారని సీఎం వివరించారు. పోలీసుల తనిఖీల్లోనే బండి భగీరథ్ దొరికాడని అధికారులు తనకు తెలిపారని, తాను పోలీసుల మాటలనే నమ్ముతానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
పోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులే అరెస్ట్ చేశారని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని అప్పగించి ఉంటే తమ ఇంట్లోనే అప్పగించి ఉండేవారన్నారు. పోక్సో కేసులో ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ్ కేసులో వీరిద్దరూ జడ్జీలుగా మారిపోయి ముందే తీర్పులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ చట్టాల ప్రకారం పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉందని, కానీ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకుని దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బండి భగీరథ్ విషయంలోనూ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామని. పోక్సో కేసులో పోలీసులు ప్రొసీజర్ ప్రకారమే వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.

బీఆర్ఎస్ నేతల పై రేవంత్ ఆగ్రహం
కేటీఆర్ ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగంలోనే ఉన్నానని అనుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిగిపోయి చాలా రోజులు అయ్యిందన్నారు. పార్టీ మీటింగ్ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్.. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. కులగణన విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన రేవంత్... తెలంగాణ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి అన్ని వివరాలు ప్రజల ముందుంచామని చెప్పుకొచ్చారు. 'జనగణనలో కులగణన' విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. మోదీ ప్రభుత్వం తక్షణమే జనగణనలో కులగణన చేర్చి బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయిందని.. ఇంకా 20 శాతం మిగిలి ఉందన్నారు. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని రేవంత్ ప్రకటించారు.













Click it and Unblock the Notifications