కేంద్రానికి సీఎం జగన్ లేఖ - ఏపీ విద్యార్దులను రప్పించండి : ఏపీ భవన్ లో ఏర్పాట్లు..!!
ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాసారు. ఉక్రెయిన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఏపీ ముఖ్యమంత్రి కోరారు. విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుత అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు రక్షించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సహాయం కోరిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నానంటూ సీఎం లేఖలో వివరించారు.

తెలుగు విద్యార్ధులపై సీఎం లేఖ
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు సైతం ఉక్రెయిన్లో ఉన్నారని.. వారిని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని జగన్ కోరారు. ఉక్రెయిన్లోని భారత ఎంబసీని ఏపీ విద్యార్థులు సంప్రదించాలని జగన్ సూచించారు. ఏపీ ప్రభుత్వం సైతం ఏపీ విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు కృషి చేయాలని కోరారు. ఉక్రెయిన్ లో నెలకొని ఉన్న టెన్షన్ నేపథ్యంలో ఆ దేశాన్ని విడిచి తాత్కాలికంగా వెళ్లిపోవాలంటూ అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భారతీయులకు సూచించింది.

ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది
దీంతో..అక్కడి వారు భారత్ కు తిరిగి వచ్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసారు. అయితే, ఏపీకి చెందిన కొందరు ఉక్రెయిన్ లో ఉన్నట్లుగా సమాచారం అందటంతో సీఎం జగన్ లేఖ రాసారు. వారిని స్వదేశానికి రప్పించటానికి అవసరమైన మద్దతు, సహాయం అందించడానికి.. విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశాంగ శాఖ అధికారులతో ఏపీ అధికారులు నిరంతరం మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు.
Recommended Video

ఢిల్లీ ఏపీ భవన్ ఏర్పాట్లు
ఏ విధమైన సహకారం కావాలన్నా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లేదా ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విదేశాంగ శాఖ అధికారులు సంప్రదించవచ్చని సీఎం జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకునే విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకునేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఏపీ భవన్ సిద్ధమైంది. విద్యార్థులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఏపీ భవన్ను సంప్రదించాలని భవన్ అధికారులు పేర్కొన్నారు. వారికి విమానాశ్రయంలో సహాయ సహకారాలు అందిస్తారని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications