జగన్ సక్సెస్ చేసారు, ఇక్కడా అలాగే చేస్తాం - సీఎం కేసీఆర్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రస్తావన చేసారు. తెలంగాణలో ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ధీటుగా కొత్త వరాలను ప్రకటించారు. ప్రతీ ఒక్కరికీ రాష్ట్రంలో రూ 5లక్షల భీమా కల్పిస్తామని చెప్పారు. అదే విధంగా ఆసరా పెన్షన్ ను రూ 5వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని ప్రశంసించారు.
ఏపీలో పెన్షన్ స్కీంపై : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సమయంలో ఆసరా పెన్షన్ పెంపు గురించి వివరించారు. ప్రస్తుతం అందిస్తున్న రూ 2,116 ఆసరా పెన్షన్ ను రూ 5వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందుకోసం తమ ఆలోచనలను స్పష్టం చేసారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేసిన విధంగా క్రమేణా పెన్షన్ పెంపుదల అమలు చేసారని గుర్తు చేసారు. వైఎస్ జగన్ పెన్షన్ రూ.2000 నుండి ప్రతి సంవత్సరం రూ.250 చొప్పున ప్రతి సంవత్సరం పెంచుతూ రూ.3000 చేసి విజయవంతంగా నడిపిస్తున్నారని అభినందించారు.

జగన్ అమలు చేసిన విధంగా : తెలంగాణలో కూడా అదే తరహాలో ప్రభుత్వం మీద ఒకేసారి భారం పడకుండా ఆసరా పెన్షన్ సంవత్సరానికి రూ.500 చొప్పున పెంచి రూ.2016 నుండి రూ.5000 వరకు పెంచుతామని వెల్లడించారు. జగన్ 2019 ఎన్నికల సమయంలో అప్పుడు ఉన్న సామాజిక పెన్షన్ ను రూ 2000 నుంచి రూ 3000కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదికి రూ 250 చొప్పున పెంచుతూ నాలుగేళ్ల కాలంలో వెయ్యి రూపాయాలు పెంచుతామ ని చెప్పుకొచ్చారు.
అదే విధంగా ఇప్పటి వరకు పెంచుతూ రూ 2,750 కి చేరిన పెన్షన్ కు వచ్చే జనవరి 1న మరో రూ 250 పెంచాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇచ్చిన హామీ మేరకు రూ 3000 కి పెన్షన్ మొత్తం చేరనుంది. ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో పెంచట ద్వారా ప్రభుత్వం పైన ఒక్క సారిగా భారం పడదని కేసీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటన : ఇక, తెలంగాణ రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిలే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ 5 లక్షల చొప్పున భీమా అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వమే ప్రతీ ఒక్కరి భీమా చెల్లింపు చేస్తుందని..ఎల్ఐసీ నుంచి ఈ భీమా అందేలా అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తామని కేసీఆర్ వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ కింద రూ 15 లక్షల వరకు చికిత్స అందిస్తామని ప్రకటించారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ 3వేలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లో విజయం ఖాయమని కేసీఆర్ పార్టీ అభ్యర్దుల సమావేశంలో స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications