విజయవాడకు రేవంత్ టీం - రాహుల్ బిగ్ టాస్క్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ విజయవాడకు రానున్నారు. ఆయనతో పాటుగా మంత్రివర్గ సహచరులు ఏపీకి వస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో రేవంత్ తో సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పైన చర్చించారు. ఆ వెంటనే ఇప్పుడు రేవంత్ ఏపీ పర్యటనకు రానున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ రేవంత్ టీం విజయవాడ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.
కొత్త వ్యూహాలతో
ఎన్నికల తరువాత ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. పీసీసీ చీఫ్ షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల ప్రచారం చేసారు. ఎన్నికల్లో జగన్ ఓటమి తరువాత షర్మిల ఇప్పుడు పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసారు. ఈ నెల 8న వైఎస్సార్ జన్మదినం. ఆ రోజున జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. షర్మిల సైతం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అటు వైసీపీ...ఇటు కాంగ్రెస్ వైఎస్సార్ జన్మదిన వేడుకలకు సిద్దమయ్యారు.

కాంగ్రెస్ నేతల రాక
విజయవాడలో ఈ సారి వైఎస్సార్ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు షర్మిల సిద్దమయ్యారు. పీసీసీ చీఫ్ గా నియమితులైన తరువాత తొలి సారి వైఎస్సార్ జన్మదినం రావటంతో పార్టీ అధినాయకత్వం నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ప్రముఖులను ఈ కర్యక్రమానికి షర్మిల ఆహ్వానించారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం తో పాటుగా మంత్రులు, కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సహా డీకే శివకుమార్ ను స్వయంగా ఆహ్వానం పలికారు. ఈ కర్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డితో సహా భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి రానున్నట్లు సమాచారం.

ఏపీ పై రాహుల్ ఆశలు
వైసీపీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో..కాంగ్రెస్ రాష్ట్రంలో ఎదిగేందుకు సరైన సమయంగా భావిస్తోంది. కాంగ్రెస్ తమ లీడర్లు, ఓటర్లు వైసీపీ వైపు వెళ్లటంతో ఇప్పుడు తిరిగి తమ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీలో పార్టీ ఎదిగేలా షర్మిలకు సహకారం అందించాలని రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు సమాచారం. అందులో భాగంగా వైఎస్సార్ జన్మదినం వేదికగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను ముఖ్య నేతలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications