సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ - నో కాంప్రమైజ్..!!
ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. హైడ్రా లక్ష్యం గురించి తేల్చి చెప్పారు. రాజీ లేదని స్పష్టం చేసారు. చెరువులను ఆక్రమిస్తే.. చేరసాలేనని తేల్చేసారు. ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్ళండని హెచ్చరించారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమబద్దీకరణ ఉండదని క్లారిటీ ఇచ్చారు. దీంతో, హైడ్రా పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా హైడ్రా విషయంలో రేవంత్ స్పష్టమైన లక్ష్యంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది..
చెరువులు, నాలాలను ఆక్రమించుకుని నిర్మించిన వాటిని కూల్చడం తన బాధ్యతని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదని రేవంత్ తేల్చేసారు. కూల్చివేతలపై కోర్టులకు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నా.. న్యాయస్థానాల్లో పోరాటం చేసి గెలుస్తామన్నారు. కబ్జాదారులు ఇకనైనా ఆక్రమణలను విడిచిపెట్టాలని హితవు పలికారు. చెరువులు, కుంటలను ఆక్రమిస్తే.. భారీవర్షాలు కురిసినప్పుడు వరదలు ఎలా వస్తున్నాయో చూస్తున్నామన్నారు. వాటి ఆక్రమణలతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయని వివరించారు.

ఆక్రమణ దారుల్లో ఎంత పెద్ద వారు ఉన్న వదిలేది లేదన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకున్నవారు వెంటనే వాటిని విడిచిపెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా నేలమట్టం కాకతప్పదన్నారు. హైదరాబాద్ నీటి కాలుష్యమంతా నల్గొండను ముంచెత్తుతోందని, అందుకే మూసీ నది ప్రక్షాళనను చేపట్టామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో సైనిక స్కూల్ తరహాలో పోలీసులకు 50 ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు.
విజిలెన్స్ ను ప్రక్షాళన చేయటానికి కొత్తకోటకు బాధ్యతలు అప్పగించామని రేవంత్ చెప్పుకొచ్చారు. పోలీసులంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించేలా ఉండాలని సూచించారు. పోలీసుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదే అని రేవంత్ హామీ ఇచ్చారు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవశ్యమని సీఎం వ్యాఖ్యానించారు. హైడ్రా ఆక్రమణల విషయంలో మందుకే వెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications