సీఎం జగన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ - తక్షణం జోక్యం చేసుకోండి..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాసారు. కుశస్థలి నదిపై జలాశయాల నిర్మాణాలు చేపట్టవద్దంటూ లేఖలో కోరారు. సమస్య సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని తక్షణ వ్యక్తిగత జోక్యం అవసరమని స్టాలిన్ అభ్యర్ధించారు. కుశస్థలి నదిపై చిత్తూరు జిల్లాలో 2చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసిందంటూ స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. దీని కారణంగా చెన్నైతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలకు తాగు నీటి పైన ప్రభావం చూపుతుందని వివరించారు.
చెన్నైకు తాగునీటి వనరుగా ఉన్న పూండి రిజర్వాయరు ఇన్ఫ్లోపై ప్రభావం చూపుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసారు. కుశస్థలి అంతర్రాష్ట్ర నది కావడంతో దిగువ రాష్ట్ర అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రం ఎలాంటి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి..ఆమోదించటం సాధ్యం కాదనే విషయాన్ని స్టాలిన్ లేఖలో వివరించారు. నదీ పరివాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని స్టాలిన్ కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సమస్య సున్నితత్వాన్ని అర్దం చేసుకొని..వ్యక్తిగతంగా అధికారులు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని స్టాలిన్ అభ్యర్దించారు. తమిళనాడు ముఖ్యమంత్రి లేఖతో దీని పైన ఇప్పుడు ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏం చేయాలనే దాని పైన చర్చలు మొదలు పెట్టారు.
రెండేళ్లుగా భారీ వర్షాలు పడుతుండటంతో సుమారు 10 టీఎంసీల వరకు నీరు వృథాగా తమిళనాడుకు వెళ్లింది. దీంతో కార్వేటినగరం, నగరిలో ప్రాజెక్టులు నిర్మిస్తే ఇక్కడి రైతులకు ఉపయోగంగా ఉంటుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. నూతనంగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు పదేళ్ల క్రితమే వీటికి అంతర్రాష్ట్ర అనుమతులు వచ్చాయని జల వనరుల శాఖ అధికారుల వాదన. అయితే, ఇప్పుడు దీని పైన అభ్యంతరం చెబుతూ తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాయటంతో ఏపీ ప్రభుత్వం భవిష్యత్ నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి.