రూ.200 కోట్ల పంపకం, చంద్రబాబు గూబ గుయ్మనేలా..: దుమ్మెత్తిపోసిన జగన్
అవసరమైతే తాను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటానని, దివిస్ బాధితులకు అండగా ఉంటానని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
రాజమహేంద్రవరం: అవసరమైతే తాను కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటానని, దివిస్ బాధితులకు అండగా ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
దివిస్ ఫార్మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మీద 22 కేసులు పెట్టారన్నారు. వాటిలో 7 హత్యాయత్నం కేసులు అన్నారు. అసలు వీళ్లకు హత్యాయత్నం కేసులు ఏంటే తెలుసునా అని ప్రశ్నించారు.

జగన్ పరామర్శ
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో దివిస్ బాధితులను జగన్ పరామర్శించారు. అనంతరం సభలో మాట్లాడారు. దానవాయిపేట, చుట్టుపక్కల గ్రామాల్లో 82 రోజులుగా 144 సెక్షన్ పెట్టారని, ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టాలు చెప్పినా ప్రభుత్వం వినడం లేదన్నారు. పైగా కేసులు పెడుతున్నారన్నారు.

కేసులు పెడుతున్నారు
ప్రజలకు అండగా నిలబడినందుకు ఎమ్మెల్యే పైన కేసులు పెట్టారన్నారు. కమ్యూనిస్టు నేత మధును కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నారు. ఇక్కడకు వస్తే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు అన్నట్లు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు.

మహిళలు అని చూడకుండా కొడుతున్నారు
ఆడవాళ్లను, వృద్ధులను చూడకుండా కొడుతున్నారని, కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీని స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, దీని కాలుష్యం వల్ల ఇక్కడి వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మనసు, ఫ్యాక్టరీ యాజమాన్యం మనసు మారాలన్నారు.

చంద్రబాబు గూబ అదిరేలా
చంద్రబాబు గూబ అదిరేలా, ఆయన మనసు మారేలా మనం పడుతున్న బాధలు ఆయనకు తెలిసేలా చెబుదామన్నారు. ఇక్కడి హ్యాచరీస్లలో ఇరవై ముప్పై వేల మంది పని చేస్తున్నారని, పరిశ్రమలు కడితే వీరు ఎక్కడకు వెళ్లాలన్నారు. ఇక్కడ 250 హ్యాచరీస్ ఉన్నాయని, బహుశా ఇలాంటి అక్వా జోన్ దేశంలో లేదేమో అన్నారు.

ఉద్యోగాలు పోతాయ్
ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు ఉంటే, ఇంత పెద్ద ఉత్పత్తి ఉంటే దానిని నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సముద్రం నీరు ఉంటే హ్యాచరీస్ పెడతారని, కానీ దివిస్ పరిశ్రమకు సముద్రం నీరు అవసరం లేదన్నారు. పైగా కలుషిత నీరు కలిపేందుకు మాత్రం సముద్రం నీరు కావాలన్నారు.

ఇరవై వేల ఉద్యోగాలు పోతాయ్
ఫ్యాక్టరీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని తెలుసునని, కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల ఇరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది కీడు కాదా అని ప్రశ్నించారు. ఇక్కడకు వంద కిలో మీటర్ల దూరంలో ఫార్మా సిటీ ఉందని, అక్కడ దివిస్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చన్నారు.

ధారాదత్తం
ఒక మున్సిపాలిటీకి కావాల్సిన మంచి నీటిని దివిస్ తీసుకొని, మురుగు నీటిని వదిలేస్తుందన్నారు. దివిస్కు ఐదు లక్షల రూపాయలకే ఎకరా భూమి ధారాదత్తం చేస్తున్నారన్నారు. రైతుల దగ్గర భూములు లాక్కొని దివిస్కు ఇస్తున్నారన్నారు. రూ.250 కోట్ల విలువైన భూమిని రూ.30 కోట్లకే ఇస్తున్నారని, మిగిలిన రూ.200 కోట్లను చంద్రబాబు, దివిస్ పంచుకుంటున్నారన్నారు.

చంద్రబాబు దారుణం
అధికారం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పెట్టిన పరిశ్రమలు కూడా ఏం లేవన్నారు. దివిస్ వల్ల వందలాది హ్యాచరీస్ మూతపడతాయన్నారు. చంద్రబాబుకు, దివిస్కు ఉన్న లావాదేవీలు ఏమిటో గానీ, జనాలకు మాత్రం నష్టమన్నారు. దయచేసి దివిస్ ఇక్కడి నుంచి ఫార్మాసిటీకి వెళ్లాలన్నారు.

రెండేళ్ల తర్వాత మనమే
చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదని, రెండేళ్ల తర్వాత అధికారం మనదే వస్తుందని, ప్రజల ప్రభుత్వం వస్తుందన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మేం వచ్చాక ఇక్కడి నుంచి ఫ్యాక్టరీని తీసివేస్తామన్నారు. పోలీసు సోదరులను కోరుతున్నామని, మీరు వేసుకున్న యూనిఫాంను, నెత్తిమీద సింహాలను గౌరవించాలన్నారు. అవసరమైతే నేను కూడా వచ్చి నా పైన కూడా కేసులు పెట్టించుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications