ఎక్కడికెళ్ల: గీతాతో కల్సిన కిరణ్, బాబు సీట్లో మోత్కుపల్లి
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం గురువారం సభ్యులు గ్రూఫ్ ఫోటో దిగారు. ఈ సమయంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. లాబీల్లో చలోక్తులు విసురుకున్నారు. ఇటీవల ఢిల్లీ ఘటనపై తెలంగాణ ప్రాంత మహిళా మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అయితే, గురువారం గీతా రెడ్డి ముఖ్యమంత్రితో నవ్వులు పంచుకున్నారు.
ఈ సమయంలో కిరణ్కు ఆమె బెస్టాఫ్ లక్ చెప్పారు. దానికి స్పందించిన కిరణ్.. తాను ఎక్కడకు వెళ్లడం లేదని, మీరు కూడా ఎక్కడకు వెళ్లరన్నారు. తద్వారా రాష్ట్రం విడిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులతో కిరణ్ మరో గ్రూఫ్ ఫోటో దిగారు.
గ్రూఫ్ ఫోటోకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాలేదు. దీంతో గ్రూప్ ఫోటోలో బాబు కూర్చోవలసిన స్థానంలో మోత్కుపల్లి కూర్చున్నారు. దాంతో అంతా ఆయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ అభినందనల్లో ముంచెత్తారు.
ఇతర ఎమ్మెల్యేలతో కలిసి తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ నుంచి బయటకు రాగానే లాబీల్లో ఉన్న టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాదంటూ ఏదో చెప్పబోగా.. హరీశ్ ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని మీరు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే గవర్నర్ అంటూ పొగిడారు.
దాంతో ముద్దు ముసిముసిగా నవ్వుతుంటే హిస్ ఎక్సిలెన్సీ అంటూ తాము ఇప్పటి నుంచి గౌరవిస్తామని హరీశ్ అన్నారు. తెలంగాణకు గాలి గవర్నర్, ఆంధ్రకు మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అని హరీశ్ తెలిపారు. గాలి, బొజ్జల చెరి రెండున్నర ఏళ్లపాటు తెలంగాణ గవర్నర్లుగా ఉంటారని హరీశ్ చెప్పుకొచ్చారు.