జగన్ బెయిల్ రద్దు పిటీషన్ను కోర్టు డెఫినెట్గా కొట్టేస్తుందనే అనుకుంటున్నా:సుప్రీంకు వెళ్తా:రఘురామ
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటీషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేస్తుందని తాను భావిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు నాయకుడు, లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. అదే జరిగితే- తాను సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్తాననీ స్పష్టం చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

సీబీఐ కోర్టులో కొట్టివేత..
ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ జగన్కు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ ఇది. ఇదివరకు ఇదే విషయంపై ఆయన తొలుత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం వాదోపవాదాలను ఆలకించింది. రఘురామ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించలేదు. ఈ పిటీషన్ను కొట్టేసింది. దీనితో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

రఘురామను తప్పుపట్టినట్టు..
రెండు రోజుల కిందటే తెలంగాణ హైకోర్టు కూడా రఘురామ దాఖలు చేసిన పిటీషన్పై విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటీషన్పై ఇంకా తుది తీర్పును న్యాయస్థానం వెలువడించాల్సి ఉంది. అదే సమయంలో- విచారణ సందర్భంగా రఘురామపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కేసు దర్యాప్తుతో సంబంధం లేని వ్యక్తులు ఎలా పిటిషన్ వేస్తారని, వైఎస్ జగన్ సాక్షులను ఏమైనా ప్రభావితం చేశారా? అని ప్రశ్నించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

నా పిటీషన్ డెఫినెట్గా కొట్టేస్తుంది
దీనిపై తాజాగా రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తెలంగాణ హైకోర్టు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను వివరణలను ఇచ్చానని రఘురామ అన్నారు. హైకోర్టు తనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ఓ దినపత్రికల్లో ప్రచురితమైన కథనం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆ పత్రిక ముందే ఊహించుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించారు. తాను వేసిన వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ను హైకోర్టు డెఫినెట్గా కొట్టి వేస్తుందని అనుకుంటున్నానని రఘురామ తేల్చి చెప్పారు.

సుప్రీంకోర్టుకు వెళ్తా..
ఆ పత్రికలో రాసిన విధానం చూస్తే పిటీషన్ కొట్టివేస్తారని అనిపిస్తోందని అన్నారు. న్యాయస్థానాలను ఎవరూ మేనేజ్ చేయలేరని, ఈ విషయంలో ప్రజలు అపోహ పడుతున్నారని రఘురామ చెప్పారు. తన పిటీషన్ను హైకోర్టు కొట్టివేస్తుందని కూడా ఆ పత్రికలో రాశారని, వారికి ముందే తెలిసి ఉండొచ్చని అన్నారు. తన పిటీషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తే..సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయమని కోరుతూ పిటీషన్ వేసే అర్హత తనకు ఉన్నప్పటికీ.. అవాస్తవాన్ని ఆ పత్రిక రాసిందని చెప్పారు.

అది చాలా పెద్ద మాట..
భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలను కూడా రఘురామ కృష్ణంరాజు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బెయిల్పై ఉన్న నేతలందరూ జైలుకు వెళ్లక తప్పదంటూ ఓ కేంద్ర మాజీమంత్రి, బీజేపీలో సీనియర్ నాయకుడు చెప్పడాన్ని తీవ్రంగానే పరిగణించ వచ్చని వ్యాఖ్యానించారు. అది చాలా పెద్ద మాటేనని పేర్కొన్నారు. ఆయన చెప్పిన మాటలు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి వచ్చిన సంకేతాలుగా భావింవచ్చని రఘురామ అన్నారు.












Click it and Unblock the Notifications