కోర్టులో ధర్మమే గెలుస్తుంది.. ఇళ్ళ పట్టాల పంపిణీ జాప్యంపై సీఎం జగన్ వ్యాఖ్యలు
ఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. స్పందన కార్యక్రమంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మాట్లాడిన సీఎం జగన్ దురదృష్టవశాత్తు టిడిపి నాయకుల ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టులలో చాలా కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని ఆయన అన్నారు.

ధర్మమే గెలుస్తుంది అన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ఇళ్ల స్థలాలను డి పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అనుకున్నామని,అలా ఇస్తే వారికి ఆస్తి ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావించిందని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే ఇంత సమయం తీసుకున్నామని అన్నారు. ధర్మమే గెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసిన జగన్ ఆగస్టు 15 నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాడే నిరుపేదలకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీతో కాస్త భరోసా అందుతుందని,స్వాతంత్రం వచ్చినట్లే అవుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

టీడీపీ హయాంలో ఇళ్ళ లెక్క చెప్పిన జగన్
అంతే కాదు టిడిపి హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని పేర్కొన్న సీఎం జగన్ ఇప్పుడు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో అర్బన్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా ఏడు లక్షల ఇళ్ళు కట్టాలని కేవలం మూడున్నర లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు.అవి కూడా చాలావరకు సగంలోనే ఆపేశారు. దీనికి సంబంధించి బకాయి కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టారు. ఇక ఇప్పుడు 15 లక్షల ఇళ్లు నిర్మాణానికి సిద్ధమవుతుంటే అడుగడుగున అడ్డుపడుతున్నారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

ఈ గ్యాప్ సద్వినియోగం చేసుకుని మెరుగ్గా పని చెయ్యాలని కలెక్టర్ లకు సూచన
ఇదే సమయంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడిన నేపథ్యంలో మరింత మెరుగ్గా పని చేయాలని ఈ పథకంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్లకు తెలిపారు .లేఅవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలని, పట్టా డాక్యుమెంట్ల లో ఫోటోలు పెట్టడం, ప్లాట్ నెంబర్, హద్దులు పేర్కొనడం చేయాలని ఇక ఈ టైం గ్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ చేయించడం సునాయాసం అవుతుందని సీఎం జగన్ అన్నారు .

ఇళ్ళ పట్టాలు ఇవ్వటమే కాదు 15లక్షల ఇళ్ళు నిర్మిస్తాం
ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాను ప్రతి గ్రామ వార్డు సచివాలయాలలో డిస్ ప్లే చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఇళ్ల స్థలాలు రానివారికి కూడా దరఖాస్తు చేయించి వారికి 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం జగన్ తెలిపారు. కచ్చితంగా ఏపీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని, పదిహేను లక్షల గృహ నిర్మాణాలు చేసి తీరుతామని సీఎం జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications