ఏపీలో 16 హెల్త్ హబ్స్-ఎక్కడికక్కడ నాణ్యమైన వైద్యం-సీఎం జగన్ కీలక నిర్ణయం-అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సంక్షోభం ఎదురైనా ఎదుర్కొనేలా రాష్ట్రంలో 16 హెల్త్ హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు... వ్యయ,ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్,బెంగళూరు లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన భారం తప్పనుంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై శుక్రవారం(మే 28) నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు...
తాజా సమీక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'రాష్ట్ర ప్రజలు వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలి.' అని పేర్కొన్నారు. ఇందుకోసం ఒక్కోచోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. మూడేళ్ల కాల వ్యవధిలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలని సూచించారు.

ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
ఈ చర్యలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో, కార్పోరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవుతాయని చెప్పారు. కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయన్నారు. టెరిషరీ కేర్ మెరుగు పడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి పరుగులు పెట్టే అవసరం ఉండదన్నారు. అలాగే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పథకంతో మరింత నాణ్యమైన వైద్య సేవలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పొందవచ్చునన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ తయారయ్యే పాలసీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video

ఇతర రాష్ట్రాలకు వెళ్లే భారం తప్పుతుంది
లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో అంబులెన్సుల రాకపోకలపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు సరిహద్దు చెక్ పోస్టుల వద్దే నిలిపివేశారు. ఆస్పత్రులు జారీ చేసిన లెటర్స్,ఇతరత్రా అనుమతులు ఉన్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఓవైపు మనుషుల ప్రాణాలు పోతుంటే ఇలా సరిహద్దుల్లో అంబులెన్సులను నిలిపివేయడమేంటని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు హైకోర్టు జోక్యంతో తెలంగాణ పోలీసులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీ ప్రజలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాల్లోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎం జగన్ హెల్త్ హబ్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications