జగన్ గాయనికి కుట్లు
YS Jagan injury: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరిన ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ ఉదంతం నేపథ్యంలో నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటన జగన్ గాయపడ్డారు. ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది.

అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసుకున్న అనంతరం బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు. రాత్రి విరామం అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో జగన్ భార్య వైఎస్ భారతి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.
డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. గాయానికి కుట్లు వేశారు. మూడు కుట్లు వేసినట్లు సమాచారం. కొంత విశ్రాంతి అనంతరం జగన్ కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్ కు బయలుదేరి వెళ్లారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించారని, నేటి బస్సు యాత్రకు విరామం ఇచ్చినట్లు తెలస్తోంది.
జగన్ బస్సు యాత్ర నేటికి 15వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదయం 9 గంటలకు కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి బయలుదేరాల్సి ఉంది. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications