కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటికి 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోందీ బస్సు యాత్ర.
ఈ ఉదయం ఎండాడ ఎంవీవీ సిటీ నుంచి ప్రారంభమైంది. మధురవాడ మీదుగా ఆనందపురానికి చేరుకుంటుంది. అక్కడ చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ సమావేశమౌతారు. ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

మధ్యాహ్నం 3:30 గంటలకు బొద్దవలస మీదుగా చెల్లూరుకు చేరుకుంటారు జగన్. అక్కడ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసకు వస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్లో బస చేస్తారాయన.
ఈ ఉదయం విశాఖపట్నం ఎండాడ నైట్ క్యాంప్లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక హామీ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటామని జగన్ అన్నారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా కార్మికుల తరఫున తమ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమెత్తిందని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా ఉంటామనీ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తామే లేఖ రాశామని జగన్ గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పరిష్కార మార్గాలను కూడా తాము కేంద్ర ప్రభుత్వానికి సూచించామని జగన్ చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ రాజీలేని ధోరణిని అనుసరిస్తోన్నాయని తేల్చి చెప్పారు.

ఎన్నికలు వస్తోన్నాయని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పుడు కూటమి కట్టాయని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆయా పార్టీలన్నీ నైతికత, విలువలను విడిచిపెట్టాయని జగన్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆయా పార్టీల వైఖరి ఏమిటో కూడా ఈ సందర్భంగా బయటపడింది జగన్ పేర్కొన్నారు.
శాశ్వతంగా ఇనుప ఖనిజ గనులను వైజాగ్ ఉక్క ఫ్యాక్టరీకి కేటాయించడం ద్వారా దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని జగన్ తెలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లోకి వస్తే అన్ని అంశాలు పరిష్కారమౌతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వైజాగ్ ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నామని, ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికుల మద్దతు కోరే నైతికత హక్కు తమకు మాత్రమే ఉందని చెప్పారు. తమ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ కార్మిక నేతలను కోరారు.

ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమికి సంపూర్ణ మెజారిటీ రాకపోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్సీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమౌతుందని జగన్ తెలిపారు. అలాంటి పరిస్థితే కేంద్రం ఏర్పడితే- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని చెప్పారు.
గాజువాకలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి గెలిస్తే ఇక్కడి ప్రజలు గానీ, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కార్మికులు గానీ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారనే సంకేతాలను పంపించినట్టవుతందని జగన్ పేర్కొన్నారు. అందుకే- తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి, తాము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చాటి చెప్పాలని కోరారు.












Click it and Unblock the Notifications