కొరుకుడు పడని ఆ హామీ నుంచి వైఎస్ జగన్ మడమ తిప్పినట్టే: ముప్పేట దాడిలో ఏపీ సర్కార్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆయువుపట్టు..ఎన్నికల మేనిఫెస్టో. నవరత్న పథకాలను పొందుపరిచిన ఈ ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. ఇదివరకటి అధికార పార్టీలకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి వైఎస్ జగన్ తెర తీశారు. అయిదేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేదు.

సంక్షేమ సర్కార్గా..
అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి నవరత్న పథకాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాటిని అమలు చేస్తూ వస్తోన్నారు. కరోనా వైరస్ వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, పింఛన్ల పెంపు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ-గృహ నిర్మాణం వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోన్నారు.

ఇవ్వాళ్టి నుంచే
కొత్త సంవత్సరం నుంచి పింఛన్ల మొత్తాన్ని కూడా పెంచారు. అర్హులైన వారికి 2,500 రూపాయల పింఛన్లను మంజూరు చేశారు. ఇవ్వాళ్టి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గ్రామీణ స్థాయిలో పేద కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఉద్దేశించిన ఈ నవరత్నాలను చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేస్తోండటం వల్ల ప్రజలు.. జగన్ సర్కార్ వెంటే ఉన్నారు. దీనికి నిదర్శనాలు- గత ఏడాదిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే. తిరుపతి లోక్సభ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ వైసీపీకి తిరుగులేని మెజారిటీ లభించింది.

కొరుకుడు పడని హామీ..
తాజాగా- సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఒక్కటీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొరుకుడు పడట్లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ముప్పేటదాడిని ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీ- మద్యపాన నిషేధ విషయంలో రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోంది. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే.. దాన్ని ఎత్తేయాలని, అక్రమంగా సరిహద్దులను మద్యం రాష్ట్రంలోకి ప్రవహిస్తోందంటూ జగన్ సర్కార్పై ధ్వజమెత్తుతోంది.

మద్యపాన నిషేధ ప్రయత్నాలతో..
మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలను పరిమితం చేయడం, వాటి రేట్లను మూడు-నాలుగు రెట్లు పెంచడం ప్రజల్లో కొంత వ్యతిరేకత సైతం ఎదురైందనేది వైసీపీ నేతల అభిప్రాయం. ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లను అమ్మకానికి పెట్టడం కూడా దీనికి కారణమైంది. చీప్ లిక్కర్ రేటును 200 రూపాయలకు పైగా పెట్టడాన్ని మందుబాబులు జీర్ణించుకోలేకపోతున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ పరిణామాలు జగన్ సర్కార్కు కొంత పంటి కింద రాయిలా తయారయ్యాయి.

ధరల తగ్గింపు..
అందుకే- మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంది జగన్ సర్కార్. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ నుంచి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఇటీవలే మద్యం ధరల రేట్లను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించింది ప్రభుత్వం. వాటి రేట్లను సవరించింది. మద్యం ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వెంటనే మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. మద్యం ప్రీమియం బ్రాండ్లను కూడా అమ్మకానికి పెట్టింది.

ప్రీమియం బ్రాండ్లు అమ్మకానికి..
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కు చెందిన అన్ని రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయానికి తీసుకొచ్చింది. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి ఇచ్చింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రీమియం బ్రాండ్ల అమ్మకం వల్ల కొంత వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తోంది.












Click it and Unblock the Notifications