ఆయనపై వైఎస్ జగన్ ట్వీట్ వైరల్
తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. 'వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించడంతోపాటు తెలుగు భాష తియ్యదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారిని ప్రజలు మరవ లేరని, తెలుగు భాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఇకనుంచి దుకాణాలపై బోర్డుల్లో పేర్లన్నీ తెలుగులోనే ఉండాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యవస్థల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇవి అమలుకాకపోతే జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించనున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాథికార సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై భాషాభిమానులు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన మాతృభాషను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని, మాతృభాషలో పూర్తిస్థాయి పట్టు సాధిస్తేనే ఇతర భాషలను సులువుగా నేర్చుకోవడం వీలవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మాతృభాషను మాత్రం ఎప్పుడూ మరవవద్దంటూ సూచిస్తున్నారు.