వైఎస్ జగన్ కాలి మడమకు స్కానింగ్..?!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ రాష్ట్ర స్థాయి మహాసభలు ఆరంభం అయ్యాయి. మంగళవారం నాటితో ఇవి ముగుస్తాయి. 21వ మహాసభలు ఇవి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోలాహలం మధ్య ఈ ఉదయం మహాసభలు మొదలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 25,000 మందికి పైగా ఉద్యోగులు, ఏపీఎన్జీవో సభ్యులు, జిల్లాస్థాయి నాయకులు, ప్రతినిధులు హాజరు కావొచ్చని మొదట అంచనా వేశారు. 30 వేల మంది ఉద్యోగులు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఎప్పుడు కూడా ఏపీఎన్జీఓ మహాసభలకు ఆ స్థాయిలో ప్రతినిధులు హాజరు కాలేదు.

మహాసభల మొదటి రోజు సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులందరికీ అనుకూలంగా ఉండేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చామని అన్నారు. జీపీఎస్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయడానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్ ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పెన్షన్ స్కీమ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సభ అనంతరం వైఎస్ జగన్.. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి నేరుగా మొగల్రాజుపురానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షలను చేయించుకున్నారు. కాలి మడమకు స్కానింగ్ తీయించుకున్నట్లు తెలుస్తోంది. రిపోర్టుల ఆధారంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కొంతకాలంగా జగన్.. కాలి మడమ నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. పలు బహిరంగ సభల్లో ఆయన కాలికి మెడికేటెడ్ బ్యాండ్ను వేసుకుని కనిపించారు. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో ఈ మధ్యాహ్నం డయాగ్నస్టిక్ సెంటర్లో మరోసారి కాలి మడమకు స్కానింగ్ తీయించుకున్నట్లు తెలుస్తోంది. గంట పాటు అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం ఆయన మళ్లీ తాడేపల్లికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications